మొత్తానికి చాలా కాలం తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి ఘర్ వాపసీ చేశారు. తిరిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు! బీజేపీ తరఫున గతంలో ఎమ్మెల్సీ గా మంత్రిగా పని చేసిన నేపథ్యం ఉన్న జనార్ధన్ రెడ్డిని ఆ పార్టీ చాలా కాలం కిందట సస్పెండ్ చేసింది. మైనింగ్ కేసుల వ్యవహారం అప్పుడే జనార్ధన్ రెడ్డికి తమకు సంబంధం లేదనే కలరింగ్ ఇచ్చుకుంది కమలం పార్టీ. అయితే అప్పట్లో ఆ సస్పెన్షన్ కేవలం జనార్ధన్ రెడ్డి మీదే! బీజేపీలో ఆయన అనుచరగణం మాత్రం కొనసాగింది.
జనార్ధన్ రెడ్డి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, ఇంకా అనుచరులు అంతా బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే హోదాల్లో కొనసాగారు. కీలక నేతలుగానే వ్యవహరించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనార్ధన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ కమలం పార్టీ నో చెప్పింది! జనార్ధన్ రెడ్డికి గానీ ఆయన భార్యకు గానీ టికెట్ కేటాయింపుకు బీజేపీ నో చెప్పింది.
దీంతో జనార్ధన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. తను, తన భార్య, మరి కొందరు అనుచరులను బరిలోకి దించారు. అయితే సొంత కుటుంబీకులే ఆయన వెంట నడవలేదు. జనార్ధన్ రెడ్డి సోదరుడికి, అనుచరుడిగా పేరున్న శ్రీరాములుకు బీజేపీ టికెట్లు దక్కాయి. అయితే జనార్ధన్ రెడ్డి దెబ్బకు బీజేపీకి చుక్కలు కనిపించాయి!
బళ్లారి ప్రాంతంలో పలు సీట్లలో జనార్ధన్ రెడ్డి తిరుగు బాటు వల్ల బీజేపీకి తీరని నష్టం జరిగింది. బీజేపీని ధిక్కరించి గాలి ఎమ్మెల్యేగా నెగ్గారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన కుటుంబీకులు, మాజీ అనుచరులకు ఓటమి తప్పలేదు! బళ్లారి టౌన్లో కూడా జనార్ధన్ రెడ్డి భార్య ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ విజయం సునాయాసం అయ్యింది. మరి ఈ అనుభవం నేపథ్యంలోనో ఏమో కానీ.. జనార్ధన్ రెడ్డితో బీజేపీ రాజీకొచ్చింది. ఎమ్మెల్యే హోదాలోని జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీలోకి విలీనం చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు తిరుగుబాట్లు చేసిన వారిని బీజేపీ బుజ్జగించుకుంటోంది. జగదీష్ షెట్టర్ ను తిరిగి చేర్చుకుంది, ఇప్పుడు జనార్ధన్ రెడ్డితో రాజీని చేసుకుంది!