ఒకే వేదికపై రాజకీయ శత్రువులు!

తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇరువురు రాజకీయ శత్రువులు గతంలో ఎన్నడూలేని రీతిలో ఒకే వేదికపై దర్శనమిచ్చారు. జిల్లా రాజకీయాల్లో వీరివురూ వేర్వేరు పార్టీలకు చెందిన భిన్న దృవాలైనప్పటికీ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒకే గూటికి చెందిన వారిలా కనిపించారు.

పొరుగు జిల్లా విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు సమక్షంలో వేదికపై ఆశీనులై, రాజకీయ వర్గాల్లో కాక పుట్టించారు. ఈ నియోజకవర్గంలోని తొండంగి మండలంలో గల కె.పెరుమాళ్ళపురం గ్రామంలో డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సోదరులు మాత్రమే హాజరవుతారని, స్థానిక ఎమ్మెల్యే రాజాకు(వైసీపీ) ప్రోటోకాల్‌ విషయంలో మరోసారి శృంగభంగం తప్పదని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే రాజా అంచనాలను తారుమారు చేస్తూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు.

ఒకవైపు మంత్రి గంటా, ఇంకొక వైపు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఉండగా, దాడిశెట్టి చిరునవ్వులు చిందిస్తూ కళాశాల ప్రారంభోత్సవ సూచికగా రిబ్బన్‌ కట్‌ చేశారు.

తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఎన్నికై 3సంవత్సరాలు పూర్తి కాగా, ఒక అధికారిక కార్యక్రమంలో మంత్రి యనమలతో కలసి రాజా పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం!

Show comments