బాబు భయపడ్డారు

కాంగ్రెస్ పార్టీ అంత జడ్డిమొద్దు పార్టీ మరోటి వుండదేమో? గుడ్డిగా ముందుకు వెళ్లిపోవడమే కానీ, దాని వల్ల ఏం జరుగుతుందో చూసుకోదు. 2014 ఎన్నికల ముందు ఇదే జరిగింది. అప్పటి దాకా బకాయి వున్న లోకల్ ఎన్నికలు అన్నీ వరుసపెట్టి చేసేసింది. మున్సిపాల్టీలు, పంచాయతీలు, మండలాలు ఇలా అన్నీ ఎన్నికలు జరిపింది. పదేళ్ల పాటు వరుసగా అధికారంలో వుంటే సహజంగా వచ్చే అధికార వ్యతిరేక ఓటును బాబు గారు కొంత వరకు, జగన్ కొంత వరకు క్యాష్ చేసుకున్నారు.

ఇప్పుడు బాబుగారు అధికారంలో వున్నారు. లెక్కప్రకారం మరో ఏడాదిలో స్థానిక ఎన్నికలు జరగాలి. కానీ ఇఫ్పుడు బాబేం అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఒకేసారి జరగాలి. ఆ తరువాతే లోకల్ ఎన్నికలు జరగాలి. ఇలా చేయమని కేంద్రానికి లేఖరాస్తా.. అని అంటున్నారు.

అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నాలుగేళ్లకే ఏర్పాటయిపోతోందేమో అన్న భయం బాబుగారికి వుండి వుండాలి. పైగా ఇలా వాయిదా వేయించడం వెనుక మరో ధర్మసూక్ష్మం ఏమిటంటే, మళ్లీ లోకల్ ఎన్నికల్లో పార్టీ మద్దతును ఎర వేసి, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ల చేత బలవంతపు చాకిరీ చేయించుకోవచ్చు.

అసలు ఇప్పటికే బకాయి వున్న విశాఖ, కాకినాడ తదితర కార్పొరేషన్ల ఎన్నికలే ఇప్పటికి జరపలేకపోతున్నారు. అప్పటికీ ఎన్నికలు బకాయి వున్నకార్పొరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నిధులు ఇచ్చి, సుందరీకరణకు ప్రాధాన్యత ఇచ్చి హడావుడి చేసారు. కాకినాడ లాంటి చోట్ల జ్యోతుల నెహ్రూలాంటి వాళ్లను తెచ్చుకు వచ్చింది అందుకే.

అయినా కూడా కార్పొరేషన్ ఎన్నికలు జరపడానికి ధైర్యం చాలడంలేదు. ఇప్పుడు మరో ఏడాదిలో జరపాల్సిన స్థానిక ఎన్నికలు కూడా జరపబోవడం లేదు, ఆ బాధ్యత వచ్చే ప్రభుత్వానిదే అన్న సిగ్నల్ ఇచ్చేసారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిపి ఆ తరువాతే స్థానిక ఎన్నికలు జరపాలని లేఖ రాస్తామంటూ బాబు వెల్లడించారు.

అంటే ఇప్పుడున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మళ్లీ ఎన్నికల మీద ఇపట్లో ఆశ వదులుకొవాల్సిందే అన్నమాట. 2018 నుంచి 2019 చివరి వరకు ఎన్నికలు వుండకపోవచ్చు. ఆ తరువాత సంగతి అంటారా? అప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో? ఇక వీటి సంగతే పక్కన పెడితే బకాయి వున్నకార్పొరేషన్ ఎన్నికలు మాత్రం చేస్తారా? ఏమిటి?

Show comments