కుమారి, బాయ్‌ఫ్రెండ్స్‌.. బాగా వాడేస్తున్నారు.!

సినిమా ఎలా వున్నా, దానికి పబ్లిసిటీ బాగా చేస్తే ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. సినిమా కాస్త బాగుంటే, అంతకు ముందు చేసిన పబ్లిసిటీ, ఆ తర్వాత చేసిన పబ్లిసిటీ ఇంకా బాగా కలిసొస్తుంది. కంటెంట్‌ లేని సినిమాకి ఏం చేసినా వేస్టనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, పబ్లిసిటీ తప్పదు. ఆ మాటకొస్తే, పబ్లిసిటీ ఏ సినిమాకైనా అత్యంత కీలకం. ఆ పబ్లిసిటీని కొత్తగా ప్లాన్‌ చేయడంలో, ఈ మధ్య 'రీసెర్చ్‌లు' బాగా ఎక్కువైపోయాయి. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్తగా పబ్లిసిటీ చేసేసుకుంటున్నాయి. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, 'కుమారి 21ఎఫ్‌' ఫేం హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' సినిమాకి పబ్లిసిటీ వెరైటీగా ప్లాన్‌ చేశారు. ఇప్పుడీ పబ్లిసిటీ అందర్నీ సినిమా వైపు దృష్టి సారించేలా చేస్తోంది. షడెన్‌గా స్క్రీన్‌ మీద సాయిధరమ్‌తేజ ప్రత్యక్షమైపోతున్నాడు. అంతే షడెన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కన్పించేస్తోంది. ఏదేదో చెప్పేస్తున్నారు, అదంతా 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' గురించేననుకోండి.. అది వేరే విషయం. 

ఈ పబ్లిసిటీతో, 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' సినిమా అందరికీ బాగా పరిచయమైపోయింది విడుదలకు ముందే. అప్పుడే ఏమైంది.? ముందు ఇంకా చాలా వుందంటోంది చిత్ర యూనిట్‌. అంటే, ప్రమోషన్‌ కోసం ఇంకెంతమంది సినీ ప్రముఖుల్ని ఇలా వాడేస్తారో మరి.! నోయెల్‌, పార్వతీశం (కేరింత ఫేం), అశ్విన్‌ (రాజుగారిగది ఫేం) ఈ సినిమాలో హీరోయిన్‌ బాయ్‌ఫ్రెండ్స్‌గా నటిస్తున్నారు. హీరోయిన్‌ తండ్రిగా రావు రమేష్‌ మరో విలక్షణ పాత్రలో కన్పించబోతున్నారు. సినిమా పబ్లిసిటీ అయితే అదిరింది.. సినిమా ఎలా వుందో తెలియాలంటే విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Show comments