ఉండవల్లి శ్రీదేవి. తాజాగా బాబు వెన్నుపోటుకు బలైన ఎమ్మెల్యే. చంద్రబాబును నమ్ముకున్నందుకు రాజకీయాల్లో కుట్రలు ఎలా వుంటాయో చాలా త్వరగా తెలుసుకున్న వీరనారి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి మరీ తాడికొండ టికెట్ ఇచ్చి, చట్టసభకు పంపారు. విద్యావంతురాలైన శ్రీదేవి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి బదులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చారు.
దీంతో తాడికొండలో ఆమెపై వ్యతిరేకత పెరిగింది. ఈ విషయం తెలిసి తాడికొండలో నష్ట నివారణ చర్యల్ని వైసీపీ అధిష్టానం చేపట్టింది. అక్కడ శ్రీదేవిని కాదని ఇతర నాయకుల్ని సమన్వయకర్తలుగా నియమించారు. దీంతో తనకు టికెట్ లేదని ఆమెకు అర్థమైంది. సరిగ్గా ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైసీపీని కాదని, చంద్రబాబునాయుడి మాయ మాటలు నమ్మి ప్రలోభాలకు గురై టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారామె.
ఆ తర్వాత పలు సభల్లో జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు ఎలాంటి నాయకుడో తెలియడానికి కొంత సమయం పట్టింది. చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తనకు టికెట్ ఇవ్వకపోవడంతో శ్రీదేవి తల్లడిల్లుతున్నారు. బాపట్ల ఎంపీ సీటును తెన్నేటి కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి ఇవ్వడంతో శ్రీదేవి షాక్కు గురయ్యారు.
ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలా వుంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైందంటూ మనసులోని ఆవేదనంతా అక్షరాల్లో పెట్టారామె. అయితే శ్రీదేవికి టికెట్ ఇవ్వకపోయినా, ఏ ఒక్కరూ సానుభూతి చూపడం లేదు. జగన్ను వెన్నుపోటు పొడిచిన పాపానికి చంద్రబాబు భలే శిక్ష విధించారంటూ దెప్పి పొడిచే వాళ్లే ఎక్కువ. తనను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే భావం స్ఫురించేలా కత్తి గుర్తు పెట్టడం చర్చనీయాంశమైంది. శ్రీదేవికి జగన్ రాజకీయ జీవితాన్ని ఇస్తే, చంద్రబాబు మాత్రం ముగింపు పలికారనే చర్చకు తెరలేచింది.