టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలకు సంబంధించి కాస్సేపట్లో సెలబ్రిటీల విచారణ షురూ కానుంది. మొదటి అవకాశం ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్కే ఇచ్చింది తెలంగాణ ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ 'సిట్'. కాస్సేపట్లో పూరిజగన్నాథ్ విచారణకు హాజరు కానున్న దరిమిలా, టాలీవుడ్లో ఈ విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే, ఈ డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి పూరిజగన్నాథ్ కేంద్ర బిందువన్నట్లుగానే వుంది గనుక, పూరి విచారణ తర్వాత పరిణామాలు ఎలా వుంటాయోనని సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. విచారణతో సరిపెట్టేస్తారా.? విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అరెస్టుల వ్యవహారమేమీ వుండదనీ, విచారణ మాత్రమేనని 'సిట్' నుంచి సంకేతాలు అందుతున్నాయి.
ఇదిలా వుంటే, గతంలో పూరిజగన్నాథ్ తెరకెక్కించిన 'సూపర్' సినిమాలో బ్రహ్మానందం - అలీ మధ్య నడిచే 'లై డిటెక్టర్' కామెడీ ట్రాక్ తరహాలో విచారణ వుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు షురూ చేసేశారు. సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఇలాంటి తలనొప్పులు కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం.
డ్రగ్స్ వాడుతున్నారా.? లేదా.? వాడితే, ఎవరి నుంచి మీకు డ్రగ్స్ అందుతున్నాయి.? ఎలా డ్రగ్స్ అలవాటయ్యింది.? వాడటం మాత్రమేనా, ఎవరికైనా అలవాటు చేశారా.? డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి, వీటిపై మీరేమంటారు.? డ్రగ్స్ డీలర్ కెల్విన్తో మీకు పరిచయముందా.? వుంటే, అది ఎలాంటి పరిచయం.? ఇలా పలు ప్రశ్నలతో కూడిన పరీక్ష పూరి జగన్నాథ్కి, సిట్ అధికారులనుంచి ఎదురు కానుందన్నది మీడియాలో జరుగుతున్న ప్రచారం.
పూరిజగన్నాథ్ మాత్రమే కాదు, నోటీసులు అందుకున్న సెలబ్రిటీలంతా రోజుకొకరు చొప్పున నేటి నుంచి 'సిట్' యెదుట విచారణకు హాజరు కానున్నారు. ఇంతకీ, విచారణ తర్వాత పూరి, మీడియాలో మాట్లాడతాడా.? విచారణలో పూరి, 'సిట్' అధికారులకు ఎలాంటి సమాచారం ఇస్తాడు.? వేచి చూడాల్సిందే.
కొసమెరుపు: సాధారణ విచారణ మాత్రమేనని టాలీవుడ్ వర్గాల్లో ఇంకో వాదన బలంగా విన్పిస్తున్నా, డ్రగ్స్ కేసులో ఇంత సాధారణమైన పరిస్థితులే వుంటే, ఇంతమంది సినీ ప్రముఖులకు నోటీసులెలా వెళ్తాయట.?