పృధ్వీ వెనుక ఏదో జరిగిందా?

పృధ్వీ ఓవర్ నైట్ స్టార్ కాలేదు. అతని స్టాండర్డ్ డైలాగ్ లాగే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే. కిందా మీదా పడి, ఆఖరికి ఇప్పుడు స్టార్ కమెడియన్ రేంజ్ కు చేరుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా మరోలా వార్తలకు ఎక్కేసాడు. అతని పై ఓ మహిళ గృహహింస, చీటింగ్ కేసు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఏ వార్తకయినా రెండు వెర్షన్లు వుంటాయి. ఇంతకీ ఈ విషయంలో పృధ్వీ ఏమంటారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే..

''..ఇదంతా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నిజానికి ఇది కొన్ని వారాల కిందటి వ్యవహారం. నేను రెండు నెలలకు పైగా ఇక్కడికి దూరంగా వున్నాను. చిక్ మంగుళూరు షూటింగ్ లో వుండగా విషయం తెలిసింది. వచ్చి నా వివరణ ఇస్తా అని చెప్పాను. వచ్చాను, అంతా సెటిల్ అయిపోయింది..'' అన్నారు పృధ్వీ.

ఇంతకీ ఫిర్యాదు చేసిన మహిళ ఎవరు అని అడిగితే..''..ఆమె తన ఇంట్లో కొన్నాళ్లు పనిచేసింది. ఇప్పుడు పని చేయడం లేదు, ఆమె మాత్రమే కాదు, ఆమె భర్త కూడా పనిచేసేవాడు...మరి ఎందుకు ఆమె అలా ఫిర్యాదు చేసిందో, దీని వెనుక ఎవరు వున్నారో నాకయితే అంతపట్టడంలేదు..అయితే ఒకటి మాత్రం అనుమానంగా వుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా టీజర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఎవరికో టార్గెట్ గా మారానని మాత్రం అనిపిస్తోంది. ఎందుకంటే బెదిరింపు ఫోన్లు, దుర్భాషల కాల్స్ పెరిగాయి. ఇవన్నీ క్యాజవల్ అని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు దీని వెనుక కూడా అలాంటిది ఏదో వుందేమో? నాకయితే తెలియదు..'

ఇంచుమించుగా ఇదీ పృధ్వీ వెర్షన్. ఇటు వైపు విషయం. అటు వైపు విషయం తెలిసిందే. ఏదయినా ఎదిగిన కొద్దీ జాగ్రత్తగా వుండడం అన్నది పృధ్వీ కే కాదు, ఎవరికైనా అవసరమే.

Show comments