17 మంది అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి...!

"కీచక ఉపాధ్యాయుడు" అనే హెడ్డింగ్ తో చాలామంది చాలా కథనాలు చదివే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనకు ఈ పదం చాలా చిన్నది. ఓ నీచుడు ఏకంగా 17 మంది అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి, వాళ్లను లైంగికంగా వేధించాడు. మేటర్ బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ టైమ్ ఇది. దీంతో 10వ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ప్రాక్టికల్స్ కోసం పిలిచాడు ఆ నీచ ఉపాధ్యాయుడు. వాళ్లందరికీ మత్తుమందు కలిపిన ఆహారం తినిపించాడు. అంతా మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్లపై విచక్షణరహితంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నవంబర్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజు రాత్రి ఏం జరిగిందో చెబితే కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని బెదిరించాడు సదరు టీచర్. అయితే ఓ బాధిత విద్యార్థిని మాత్రం ధైర్యం చేసింది, జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యేని ఆశ్రయించారు.

ఎమ్మెల్యే చొరవతో ఎస్పీ రేంజ్ అధికారితో దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో కీచక టీచరు ఒకరు కాదు, ఇద్దరని తేలింది. అయితే ఇంత జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేయలేదు. కేవలం కేసు పెట్టి వదిలేశారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసులు యథావిధిగా ప్రయత్నించారు. దీంతో పుర్కాజి పోలీస్ స్టేషన్ ఇంచార్జిపై కూడా శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. 

Show comments