అరవింద్ ఉత్సాహానికి అదే కారణమా?

ఖైదీ 150 సినిమా విడుదల మెగా ఫ్యాన్స్ ను ఎంత ఉత్సాహంలో ముంచిందో, ఏంటీ బాబు జనాలను, అలాగే వైకాపా జనాలను కూడా అంతే ఆనందంలో ముంచింది. ఇది వాస్తవం.

పవన్ అనే పెద్ద గీత ముందు ఇప్పుడు చిరంజీవి అనే మరింత పెద్ద గీత చేరింది. ఇన్నాళ్లు చిరంజీవి సైలెంట్ గా వుండడంతో పవర్ స్టార్..పవర్ స్టార్ నినాదాలే వినిపించాయి. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ నినాదాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఒక్కసారి పవన్ చరిష్మా వెనక్కు వెళ్లినట్లయింది.

నా కోడీ కుంపటీ లేకపోతే అన్నట్లుగా తను వస్తే ఏదో అయిపొతుంది అనుకున్న పవన్ భ్రమలు తొలగిపోయాయి. పవన్ తన కెరీర్ లో సృష్టించలేని రేంజ్ రికార్డుల మెగాస్టార్ సెట్ చేసేసారు.

పైగా చంద్రబాబు చేతివేలు పట్టుకుని పవన్ వదలకపోవడం అన్నది కాపు వర్గానికి అస్సలు రుచించడం లేదు. అయినా ఏమీ అనలేక, మరో దారి లేక సైలెంట్ గా వున్నారు. ఇప్పుడు చిరంజీవి క్రేజ్ మరోసారి రుజువు కావడంతో, వారంతా ఇప్పుడు ఆయన వైపే చూస్తున్నారు.

ఇదిలా వుంటే అల్లు అరవింద్ ఏక్టివ్ పార్టిసిపేషన్ వుండడం వల్లే గుంటూరు సభకు పవన్ హాజరుకాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అరవింద్ రంగప్రవేశం చేయడంవల్లనే థియేటర్లు సెట్ కావడం, కలెక్షన్లు, ఇతరత్రా వ్యవహారాలు పక్కాగా వుండడం అన్నది సాధ్యమైంది. అందుకే ఈ క్రెడిట్ ను అలా వదిలేయకుండా మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అరవింద్.

నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖైదీ అంకెలు వెల్లడించి, తనదే సినిమా అన్నంత హడావుడి చేసారు. తనను వ్యతిరేకిస్తున్న పవన్ ను మరింత కార్నర్ లోకి నెట్టడానికే అరవింద్ ఈ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. పైగా సభకు రాకపోవడంతో పవన్ అంటే చరణ్ కూడా ఆసక్తి కాస్త తగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. మామ అరవింద్ అండ వుంటే ఎలా వుంటుందో కూడా గమనించాడు. అందుకే ఇక మెగా క్యాంప్ లో పవన్ ఒంటరిగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాటమరాయుడు ఫలితం తేడా వచ్చిందా? కథ ఇంకా రసవత్తరంగా మారుతుంది.

Show comments