చంద్రబాబు నిర్ణయం బ్లండర్‌ కాదు కదా!

నవ్యాంద్ర రాజదాని, దేశంలోనే గొప్ప రాజధాని, ప్రపంచంలోనే అగ్ర రాజధాని అంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు బారీ ఎత్తున ప్రచారం చేస్తుంటే సహజంగానే ఎవరికైనా అక్కడ ఏదో జరిగిపోతోందన్న భావన కలుగుతుంది. అక్కడకు వెళ్లి స్వయంగా వీక్షించాలన్న ఆలోచన కలుగుతుంది. అలాగే నాకుకూడా ఆసక్తి పెరిగింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా అక్కడకు వెళ్లాను విజయవాడ నుంచి సుమారు ఇరవైఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కాని ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయ, తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం చేరుకోలేం. ప్రకాశం బ్యారేజీ దిగగానే కుడివైపు సన్నదారిలో కృష్ణ కరకట్ట మీదుగా ప్రయాణం చేస్తూ వెళితే, అక్కడక్కడ పోలీస్‌ పోస్టులు కనిపిస్తాయి. అలాగే కృష్ణానది ఒడ్డున గతంలో ఇదే ప్రభుత్వం ప్రకటించిన అక్రమ నిర్మాణాలు కనిపిస్తాయి. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ అక్రమ కట్టడాలుగా ఉన్న భవంతులన్నిటిని కూల్చివేస్తామని, నదిని పరిరక్షిస్తామని హూంకరించారు. 

కాని ఓటుకు నోటు కేసు తర్వాత అకస్మాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సడన్‌గా అక్కడకు మకాం మార్చడంతో ఆయనకు ఒక ఇల్లు కావల్సివచ్చింది. కారణం ఏమైనా కాని చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి అక్కడ ఉన్న ఒక అక్రమకట్టడమే నచ్చింది. దాంతో వెంటనే అక్కడ భవనానికి మరింత మెరుగులు దిద్దారు. అదే అక్రమ భవనంలో చంద్రబాబు మకాంపెట్టారు. ఆ ఇల్లు దాటుతూ ముందుకు వెళితే ఒక గ్రామం వస్తుంది. ఈ మొత్తం దారి అంతా చిన్న సింగిల్‌ రోడ్డే. గ్రామం మద్య గుండా మరికొంత దూరం వెళితే సచివాలయం, అసెంబ్లీలు కనిపిస్తాయి. దారిలో కొన్ని భూములలో పంటలు ఉన్నాయి. మరికొన్ని భూములలో పంటలు లేవు. వాటి గురించి వాకబ్‌ చేస్తే భూములు ఇవ్వని రైతులు తంటాలు పడి కోర్టు ఆర్డర్‌ తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ప్రభుత్వ అదీనంలో ఉన్న భూములలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు కొట్టించడానికి ప్రభుత్వానికి భారీగానే ఖర్చు అవుతోందట. కొద్దిదూరంలో ఎక్స్‌ప్రెస్‌ వే వేయడానికి మట్టి తోలి కనిపిస్తుంది. అది పూర్తి అయితే అక్కడ వాతావరణం కాస్త మెరుగు అవుతుందేమో! మరోదారి మంగళగిరి నుంచి కూడా ఉంది. అది కొంత డబుల్‌ రోడ్డుగా ఉంది. 

నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే సచివాలయం సామాన్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. కాని ఇది ప్రజలు ఎవరికి అందుబాటులో లేకుండా కట్టారన్న అభిప్రాయం కలుగుతుంది. ఎవరైనా ఇతర జిల్లాల నుంచి ప్రజలు విజయవాడ లేదా గుంటూరుకు చేరుకుని, అక్కడ నుంచి ప్రయాసలకు ఓర్చితే కాని సచివాలయం చేరుకోలేరు. మూడు పంటలు పండే భూములు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తప్పు చేశారని గతంలో అనుకునేవారం. స్వయంగా ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత చంద్రబాబు బ్లండరే చేశారన్న భావన కలిగింది. ఎందుకంటే మంగళగిరికి సమీపంలోనే ఐదువేల ఎకరాల ప్రభుత్వభూమి ఉందట. లేదా నాగార్జున యూనివర్శిటీ పెద్ద ఆవరణ ఉంది. వీటిని కాదని ముఖ్యమంత్రి కొత్తగా పంటలు పండేభూములు తీసుకోవడం ఒక సమస్య అయితే, ప్రధాన రహదారికి ఇరవై నుంచి ఇరవైఐదు కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఏర్పాటు చేయడం బ్లండర్‌గా అనిపిస్తుంది. ఈ మాట అంటే ఏలినవారికి కోపం రావచ్చు. మంగళగిరి, యూనివర్శిటీ లేదా గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న మెట్ట ప్రాంతాలను చంద్రబాబు ఎంపిక చేసుకుని ఉంటే ఆ ప్రాంతం అంతా బాగా అభివృద్ది చెందే అవకాశం ఉండేది. ఆయనకు మంచి పేరు వచ్చేది. కాని ఆయన అలా చేయకుండా నదికి దక్షిణాన, రెండు నగరాల మద్య ముప్పైవేల ఎకరాల భూములను ఎంపిక చేసుకున్నారు. 

ఆయనకు వాస్తు నమ్మకమో, మరే కారణమో కాని ఆయన అలా చేయడం వల్ల నగరం సహజ సిద్దంగా ఎదగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వం రూపొందించే రకరకాల నగరాల నిర్మాణాలు జరిగితే ఎలా ఉంటుందో కాని, అవన్ని అంత తేలికకాదనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు రెండు, మూడు లక్షల మంది జనం వచ్చి అక్కడ భవంతులు కట్టే పరిస్థితి ఉందా అన్నది సందేహమే. ఇదో సమస్య అయితే సచివాలయ భవనాలు పల్లంగా ఉన్నాయని అంటున్నారు. వరద వస్తే ఆ ప్రాంతం అంతా చిత్తడి అవుతుంది. ఈ ప్రాంతాన్ని ఎత్తు చేస్తే చుట్టు పక్కల గ్రామాలు ఇబ్బంది పడతాయి. వీటికోసం మళ్లీ మరో 250 కోట్లతో వరదనీటీని తోడే మోటార్లను ఏర్పాటు చేస్తారట. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న సామెతగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బురదలో కాలువేసినట్లుగా ఉంది. చంద్రబాబుకు బహుశా విజయవాడ పేరు ప్రచారం అవడం అంటే ఇష్టం లేదనుకోవాలి. అందుకే ఆయన అమరావతి అన్న కొత్త పేరు పెట్టారు. ఆ బ్రాండ్‌ అయితే తన పేరు గుర్తు ఉంటుందని ఆయన భావనకావచ్చు. 

ఆ తర్వాత కాలంలో విజయవాడ, గుంటూరు మొత్తం తానే నిర్మించానని చెప్పుకునే అవకాశం ఉంటుందన్న నమ్మకం కావచ్చు. పోని నిజంగానే అమరావతి అంటే అంత విశ్వాసం ఉంటే నిజంగా ఆ పట్టణం ఉన్న చోటకు, అక్కడి  దేవాలయానికి వెళ్లడానికి, అలాగే నాగార్జుని పేరిట ఉన్న యూనివర్శిటీలోకి వెళ్లడానికి పాలకులు భయపడతారట. ఇక రైతుల నుంచి తీసుకున్న భూములకు ప్లాట్లు ఇవ్వడం,అందులో ఏవో అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలు రావడం వంటివి జరుగుతున్నాయి. పంటభూములు తీసుకోవడం ఎందుకు, రైతులకు పరిహారం ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వ భూములను, అడవీ భూములను వదలి భూసేకరణ పేరుతో రైతులను ఇబ్బందుల పాలు చేయడం ఎందుకు? ప్రభుత్వంలో అనుకున్నవి అనుకున్నట్లు జరగడం కష్టం. అంతదాకా ఎందుకు తాత్కాలిక సచివాలయానికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా? అయినా నిజానికి అసెంబ్లీలో సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనినిపించింది. గ్యాలరీలు సరిపోని పరిస్థితి ఉంది. 

నిజానికి వీటినే శాశ్వత ప్రాతిపదికన ఇంకా కొంచెం పెద్ద భవనం, అన్ని హంగులతో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. పాలకులే పొలాలలో ఈ భవనాలను నిర్మించామని, బయటకు వస్తే భయం వేస్తుంటుందని అంటారు. మరోవైపు ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజధాని అవుతుందని అంటారు. దశాబ్దాల తర్వాత ఏమవుతుందో తెలియదు కాని ,ఇప్పటికైతే సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా రాజధాని నిర్మాణం చేపట్టారన్న అభిప్రాయం కలుగుతుంది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ చేశారా? ఇందులో కుంభకోణాలు జరిగాయా? లేదా? ఇతరత్ర సమస్యలు వాటన్నిటిని పక్కన బెడితే చంద్రబాబు ఏకపక్షంగా చేసిన రాజధాని ఎంపిక సరైనది కాదన్న అభిప్రాయం కలిగింది. నా భావన తప్పు అయితే సంతోషిస్తాను. కాని సామాన్యుడికి అందుబాటులో లేకుండా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏమి సాదిస్తారో, ప్రజలను ఎంత కాలం మాయచేస్తారో తెలియదు. అందుకే చంద్రబాబు చేసిన పెద్ద బ్లండర్‌ రాజదాని స్థలం ఎంపిక అనిపించింది. ఇప్పటికైనా దానిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. 

సేకరించిన భూములను పరిశ్రమలు, ఉద్యోగులు, అధికారుల ఇళ్ల నిర్మాణాలు వంటివాటికి వాడుకుని, జాతీయ రహదారికి, ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో సచివాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, హైకోర్టు వంటివి ఏర్పాటు చేస్తే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి సహజంగానే అహంకారం ఉంటుంది. తాము చేసిన తప్పులే  ఒప్పు అనిపించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. ఎటూ భజంత్రీలు అదే పనిచేస్తుంటాయి. దానితో ఎవరైనా హతవ్యాక్యం చెప్పినా వినరు. అది ప్రజల ఖర్మ అని సరిపెట్టుకోవలసిందే.
 

కొమ్మినేని వెంకటేశ్వరరావు

Show comments