పిచ్చికి ప‌రాకాష్ట ఆర్‌కే ‘కొత్త‌ప‌లుకు’

ప్ర‌తి ఆదివారం ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కీయ పేజీలో ఆర్‌కే రాస్తున్న‌ ‘కొత్త‌ప‌లుకు’లో హేతుబ‌ద్ధ‌త కొర‌వ‌డింది. ఒకే వ్యాసంలో ఆయ‌న చెబుతున్న వాటికి ప‌ర‌స్ప‌రం పొంత‌న‌ కుద‌ర‌డం లేదు.  ఈ వారం ‘మంట కలిసిన మర్యాద’ శీర్షిక‌తో రాసిన క‌థ‌నం ఆర్‌కే మాన‌సిక దుర‌వ‌స్థ‌ను, గంద‌ర‌గోళాన్ని, భ‌యాన్ని, నిస్స‌హాయ‌త‌ను ప్ర‌తిబింబిస్తోంది. పాతాళానికి అక్ష‌ర రూప‌మే ఆర్‌కే కొత్త‌ప‌లుకు. 

ఏం రాస్తున్నాడో, ఏం చెప్పాల‌నుకున్నాడో ఆయ‌న‌కే తెలియ‌ని ద‌య‌నీయ స్థితిలో అక్ష‌రం ప‌త్రిక‌కెక్కింది. ప్ర‌తి వారం అచ్చ‌య్యే ‘కొత్త‌ప‌లుకు’ ఆర్‌కే గౌర‌వాన్ని పెంచ‌క‌పోగా, ఆయ‌న అజ్ఞానం, అహంకారం, అప్ర‌జాస్వామిక ధోర‌ణుల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తోంది. ఈ అవ‌ల‌క్ష‌ణాల కొన‌సాగింపే ఈ వారం కొత్త‌ప‌లుకు కూడా. 

 ‘విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని ఎవరు అడిగారు?’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు ఆంతరంగిక సంభాషణలలో ప్రశ్నిస్తున్నారు. మేం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఉన్నదాంతో సంతృప్తిపడే మనస్తత్వం మా ప్రజలది. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అనుచరులు విశాఖలో వాలిపోతారన్న భావనే మాకు రుచించడం లేదు. మేం సంపాదించుకున్న భూములకు టికానా ఉండదా? అన్న ఆందోళనలో మేం ఉన్నాం’  అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో స్థలాలు, భూములు ఉన్నవారు అవి కబ్జాకు గురవుతాయేమోనన్న భయంతో ప్రహరీలను నిర్మించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇది కాగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారు’...ఇవి కొత్త ప‌లుకులోని ఆర్‌కే విష‌పు రాత‌లు. 

 మ‌రి ఇదే పెద్ద మ‌నిషి....ఇదే వ్యాసంలో   ‘రాజధాని విలువ, నగర ప్రాధాన్యం తెలియనివాళ్లు లేదా తెలిసినా గుర్తించడానికి ఇష్టపడనివాళ్లు రాజ్యమేలుతుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి’ అని రాశాడు. 

రాజ‌ధాని విలువ అంటే ఏంటి? ఆ విలువ ఏంటో తెలియ‌క‌నే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని పెట్ట‌మ‌ని ఎవ‌రు అడిగార‌ని ఆంత‌రింగిక సంభాష‌ణ‌ల్లో అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్నారా ఆర్‌కే? ఉన్న‌దాంతో సంతృప్తి ప‌డే మ‌న‌స్త‌త్వం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌దైతే, లేనిదాని కోరుకునే అత్యాశ ప‌రులు అమ‌రావ‌తి రైతుల‌ని మీ రాత‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవాలా సార్‌.

ఇప్పుడు మీరు కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్న అమ‌రావ‌తిలోనైనా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే కదా మ‌రో నాలుగున్న‌రేళ్లు పాల‌న సాగించాల్సింది? అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉంటే మాత్రం జ‌గ‌న్ అనుచ‌రులు వాలిపోరా? అమ‌రావ‌తిలో భూములు క‌బ్జాకు గురి కావా?  విశాఖ‌లో నిర్మించుకున్న‌ట్టు అమరావ‌తిలో కూడా భూముల‌కు ప్ర‌హ‌రీలు నిర్మించుకుంటున్నారా? ద‌శాబ్దాల త‌ర‌బ‌డి జ‌ర్న‌లిజంలో మీ అనుభ‌వం నేర్పిన విలువ‌లు ఇవేనా సార్‌?  అన్నం తింటున్న చేత్తో ప‌చ్చి బ్లాక్‌మెయిలింగ్ రాత‌లు రాస్తారా సార్‌? అవున్లే బ్లాక్ మెయిల్ పునాదుల‌పై ఆంధ్ర‌జ్యోతి సౌధం నిర్మించుకున్న మీ క‌లం నుంచి ఇంత‌కంటే గొప్ప రాత‌లు ఆశించ‌డం రాజ‌ధాని రైతుల మ‌ల్లే అత్యాశే అవుతుంది.
   
 ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బొత్స ఆ పార్టీని వదిలిపెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టుగా... మండ‌లి చైర్మ‌న్‌ షరీఫ్‌ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలలో చేరలేదు. దశాబ్దాలపాటు తనను ఏ పదవీ వరించకపోయినా ఆయన నమ్ముకున్న పార్టీని కాదనుకోలేదు. దీన్నిబట్టి ఎవరికి విలువలు ఉన్నాయో అర్థమవడం లేదా?’

బొత్స‌కు చెబుతున్న నీతులు చంద్ర‌బాబుకు కూడా వ‌ర్తిస్తాయ‌నే విష‌యాన్ని ఆర్‌కే మ‌రిచిన‌ట్టున్నాడు. కాంగ్రెస్ త‌ర‌పున ఎన్నికై, మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించార‌ని నేటి త‌రానికి తెలియ‌ద‌నే న‌మ్మ‌కంతో ఆర్‌కే ఇష్టం వ‌చ్చిన‌ట్టు నీతులు చెప్పాడు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, త‌న మామ ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తాన‌ని గొప్ప‌లు చెప్పిన చ‌రిత్ర చంద్ర‌బాబుది. మామ ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే , టీడీపీలోకి బాబు ఎగిరి గంతేసిన విష‌యం ఎవ‌రికీ తెలియ‌దనుకుంటున్నావా ఆర్‌కే?
     
 ‘రాజధానిని తరలించకుండా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు అడ్డుకుంటారని రాష్ట్ర ప్రజలు గంపెడాశతో ఉన్నారు.  నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అమరావతి కలిసివచ్చే అంశం’

అమ‌రావ‌తి ప్ర‌జ‌లే రాష్ట్ర ప్ర‌జ‌లా? ఎందుకీ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు. ఈ ధోర‌ణుల వ‌ల్లే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు దారి తీసింద‌నే విష‌యం ఆర్‌కేకు తెలియ‌దా?  ఒక‌వైపు రాజ‌ధానిపై జోక్యం చేసుకునే హ‌క్కు త‌మ‌కు లేద‌ని కేంద్రం పెద్ద‌లు చెబుతుంటే, మ‌రోవైపు బ‌ల‌ప‌డేందుకు ఇదే అవ‌కాశం అని మీలాంటి వాళ్లు చెబితే త‌ప్ప తెలియ‌ని అమాయ‌కులా బీజేపీ వాళ్లు.
   
 ‘రాజధాని తరలింపు విషయంలో జగన్మోహన్‌ రెడ్డి సక్సెస్‌ అయితే మాత్రం జనసేన బీజేపీ చేతులు కలిపినా ఒరిగేది ఏమీ ఉండదు. రాష్ట్రంలో బీజేపీ బలపడకపోగా ఆ పార్టీతో చేయి కలిపినందుకు జనసేన ఉన్న బలాన్ని కూడా కోల్పోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ లేకుండా కేవలం జనసేన -బీజేపీ మాత్రమే చేతులు కలిపినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఢీ కొనలేరన్న అభిప్రాయం కూడా ఉంది’

పోయిన వారం కూడా ఇదే ప‌లికారు క‌దా!  ఏదైనా కొత్త‌గా ప‌ల‌కండి సార్. చెప్పిందే చెప్పి, రాసిందే రాస్తూ...ఇంత‌కూ ఏమైంది సార్ మీకు. రాత త‌డ‌బ‌డుతోంది. మ‌న‌సు నిశ్చ‌లంగా ఉండ‌టం లేదు. ఏదో అశాంతి,  భీతి, శోకం, అస‌హ‌నం, ఆగ్ర‌హం, ఆక్రోశం. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ దేనికో సంకేత‌మ‌నే భావ‌న క‌లుగుతోంది. రాజ‌ధాని, జ‌గ‌న్ గురించి ఆలోచించ‌డం కొంత కాలం మానేయండి సార్‌. ఎందుకంటే ముందు మీ మ‌న‌సు, మీరు బాగుంటేనే....మిగిల‌న‌వ‌న్నీ.

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి

Show comments