బాహుబలి-2 కథ ఇదేనా?

సినిమా అభిమానులు భలే హుషారుగా వుంటారు. అదిగో టైటిల్ అంటే ఇదిగో లోగో అంటారు. అదిగో సినిమా అంటే ఇదిగో టైటిల్ అంటారు. టైటిల్,లోగో చూపించేస్తే, సినిమా కథే అల్లేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి ఆసక్తి కాస్త ఎక్కువగానే వుంటుంది. పైగా ఇటీవల సోషల్ నెట్ వర్క్ జోరు పెరగడంతో ఇలాంట కథలు, డిజైన్లు, టైటిళ్లు ఇట్టే జనాల్లోకి పాకేస్తున్నాయి. వాట్సప్ లు, ఫేస్ బుక్ లు వాటిని ప్రపంచం అంతా తిప్పేస్తున్నాయి.

బాహుబలి 2 కు సంబంధించి ఇలాంటి ఆసక్తి కరమైన పోస్ట్ ఒకటి వాట్సప్ లో చురుగ్గా చలామణీ అవుతోంది. కథ నిజమేనా? కాదా? అన్నది పక్కన పెడితే, ఇంట్రెస్టింగ్ గా వుండడమే కాకుండా, అదే బాహుబలి పార్ట్ 2 కథ అని నమ్మేలాగే వుంది. ఇంతకీ ఆ కథేంటంటే..

.....

గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపో​​స్తాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు.

తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవికసైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలు దేరుతాడు.

కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవేపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓ వేపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది.

కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.

భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.
ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు.

కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.

అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.?

మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.?

దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా .....ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్...

...

ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ, బాహుబలి 2 మీద ఆసక్తిని మరింత పెంచేలాగే వుంది మరి.

Show comments