చైతూ, రకుల్‌.. ఎందుకు నవ్వారంటే.!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి తెలుగు అంత బాగా అర్థం కాదట.. ఏదో సరదా సందర్భం గనుక, జోకేశాడనుకుని నవ్వేసిందట. 'అమ్మాయిలు... లోకి పనికొస్తారు..' అని సీనియర్‌ నటుడు చలపతిరావు 'రారండోయ్‌ వేడుక చూద్దాం' కార్యక్రమానికి హాజరై, చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ సమయంలోనే రకుల్‌, నాగచైతన్య ఆ జోక్‌ని ఎంజాయ్‌ చేశారనే ప్రచారం జరిగింది. 'ఆ వెకిలి మాటలేంటి.. ఆ మాటలకి మీ నవ్వులేంటి.?' అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కడిగి పారేస్తున్నారు.

ఈ వ్యవహారంపై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తరఫున ఓ స్టేట్‌మెంట్‌ వచ్చింది. అయితే, ఆమె స్టేట్‌మెంటేనా.? అన్నదానిపై క్లారిటీ రావాల్సి వుంది. రకుల్‌కి తెలుగు సరిగ్గా రాదు కాబట్టి, సందర్భం అర్థం చేసుకోలేకపోయిందన్నది ఆ స్టేట్‌మెంట్‌ సారాంశం. దాన్ని 'రెస్‌పెక్ట్‌ విమెన్‌' పేరుతో పోస్ట్‌ చేసింది కూడా. ఇంకో వైపున, ఆ సమయంలో తానుగానీ, చైతన్యగానీ నవ్వలేదనీ, ఆ ఫొటోకీ ఆ కామెంట్‌కీ సంబంధం లేదనీ క్లారిటీ ఇచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఇదిలా వుంటే, అక్కినేని నాగార్జున కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. చలపతిరావు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానన్నాడు. 'డైనోసార్లకు ఇప్పుడు అవకాశం లేదు' అని కూడా ట్విట్టర్‌లో పేర్కొనడం గమనార్హం.

కాగా, 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలోని, 'అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం..' అని నాగచైతన్య చెప్పే డైలాగ్‌ కూడా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అన్నట్టు, ఆ డైలాగ్‌ని ఏం చేస్తారట.? ఏమో, ఇదంతా సినిమా పబ్లిసిటీకి విపరీతంగా కలిసొస్తుందనే వాదనా లేకపోలేదు. ఒక్కటి మాత్రం నిజం.. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమా మాంఛి ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలకు ముందు అంచనాల్ని పెంచేసుకుంది. కానీ, ఇప్పుడిలా ఈ సినిమా చుట్టూ జరగరాని రీతిలో వివాదం ముదిరి పాకాన పడిపోయింది.

Show comments