డబ్బు వల్లే అక్కినేనితో తేడా?

దర్శకుడు దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్ ఓ అద్భుతం. ఎన్ని హిట్ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చాయో ఆ కాంబినేషన్ నుంచి. మేఘ సందేశం సినిమా అక్కినేని కెరీర్ లో టాప్ సినిమాల్లో ఒకటి.

ప్రేమాభిషేకం సినిమా తన స్టూడియోను నిలబెట్టిందని, లేదూ అంటే అమ్మేద్దాం అనుకున్నా అని, అక్కనేనినే స్వయంగా ఆ రోజుల్లో చెప్పినట్లు గుర్తు. అలాంటిది  ఆ ఇద్దరికి ఎందుకో విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు. అక్కినేని మరణం వరకు ఆ విబేధాలు అలాగే కొనసాగాయి. కారణం ఏమిటీ అన్నది ఎవరికీ తెలియదు.

అయితే చిన్న అమౌంట్ వల్ల ఈ విబేధం వచ్చిందని దాసరి సన్నిహితుడు, శిష్యుడు మోహన్ బాబు ఇప్పుడు వెల్లడించారు. ఇద్దరిని కలుపుదాం అనుకున్నానని, కానీ వీలు కాలేదని, విబేధాలకు కారణాలు తనకు తెలుసు అని, అయితే ఇద్దరు ఇప్పుడు బతికి లేరు కనుక, చెప్పడం సమంజసం కాదని ఆయన వెల్లడించారు.

అయితే, ఆ విబేధాలకు కారణం చిన్న మొత్తం అని మాత్రం చెప్పగలనని ఆయన వివరించారు. అంతటి పెద్దవాళ్లు, మహానుభావుల మధ్య ఒక చిన్న మొత్తం దూరాన్ని పెంచేసింది. అందుకే అన్నారు డబ్బు అనేది ఏదయినా చేయగలదు అని.

Show comments