త్రివిక్రమ్.. హీరోయిన్లపై మనసు పడితే అంతే!

మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న హీరోయిన్ల కన్నా.. సైడ్ స్ట్రీమ్ లో ఉన్న హీరోయిన్ల మీద దర్శక రచయిత త్రివిక్రమ్ కు ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా ఉన్నారు.. అని అందరి చేతా అనిపించుకునే వాళ్ల కన్నా, కొందరికే చాలా ప్రత్యేకంగా నచ్చే వాళ్లకు తన సినిమాల్లో అవకాశం కల్పిస్తూ రావడం త్రివిక్రమ్ ప్రత్యేకత. 

ఒకవైపు లీడింగ్ హీరోయిన్ ను కొనసాగిస్తూనే.. అవకాశం ఉన్నప్పుడు రెండో హీరోయిన్ దగ్గర తన టేస్టేమిటో చూపిస్తూ ఉంటాడు. రొమాన్స్ గురించి అందంగా రాయగల ఈ రచయిత.. అమ్మాయిల ఎంపికలోనూ ప్రత్యేకతను చాటుకొంటూ వస్తున్నాడు. 

‘జల్సా’ సినిమాలో ఏకంగా ముగ్గురికి అవకాశం ఇచ్చాడు. వీరిలో అప్పటికి లీడింగ్ లో ఉన్న ఇలియానాను పక్కన పెడితే, కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్.. వీళ్లిద్దరూ అంతకు ముందు కమర్షియల్ సినిమాల్లో రాణించిన వాళ్లేమీ కాదు. పవన్ సరసన కమిలినీ.. అనగానే ఆ కాంబో డిఫరెంట్ అనిపించుకుంది.

ఇక పార్వతి మెల్టన్ ను తీసుకెళ్లి మహేశ్ సరసన హీరోయిన్ గా చేయాలని కూడా త్రివిక్రమ్ ప్రయత్నించాడని అంటారు. ‘ఖలేజా’ లో పార్వతిని హీరోయిన్ గా పెట్టాలని శతథా ప్రయత్నించాడని.. అయితే నిర్మాతలు, హీరో దానికి ఓకే చెప్పలేదు.. దీంతో త్రివిక్రమ్ తగ్గాల్సి వచ్చిందని అంటారు సినీ జనాలు.

ఆ తర్వాత ‘అత్తారింటికి దారేదీ’ తో ప్రణీతను తీసుకొచ్చాడు, కేవలం సెకెండ్ హీరోయిన్ పాత్రలకే కాదు.. చెల్లెలు పాత్రలతో కూడా కొంతమంది అమ్మాయిలకు ఊపునిచ్చాడు ఈ దర్శకుడు. ‘జులాయి’ తో శ్రీముఖి, ‘అ..ఆ’ తో అనన్యలు.. మెరిశారు. 

ప్రాధాన్యత లేని పాత్రలను సృష్టించడం, అంచనాలకు అందని రీతిలో ఆ పాత్రలకు ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చే తీరును త్రివిక్రమ్ కొనసాగిస్తున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో అల్లు అర్జున్- నిత్యా లు కాసేపే జంటగా కనిపించినా కూడా రేర్ కాంబినేషనే! 

పవన్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో మళ్లీ అనుపమ పరమేశ్వరన్ కు అవకాశం ఇవ్వనున్నాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ సరసన అనుపమ.. పూర్తి స్థాయి హీరోయిన్ కాకపోయి ఉండొచ్చు. జల్సాలో కమిలినీ, సన్నాఫ్ సత్యమూర్తిలో నిత్యాను చూపినట్టుగా.. ఇందులో కూడా అనుపమది ఎక్స్ ట్రా రోలేనేమో! 

Show comments