ఆయన వెతికిన 'పీస్‌' దొరికింది.!

సినీ నటి జయసుధ, ఇటీవలే తన భర్తను కోల్పోయారు. జయసుధ భర్త నితిన్‌ కపూర్‌, ఈ మధ్యనే ముంబైలో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఆ డిప్రెషన్ కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. తన భర్త తనకు దూరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వేదికగా, ఆయనతో వైవాహిక జీవితంలో పంచుకున్న మధురానుభూతుల్ని.. తమ పెళ్ళి రోజు సందర్భంగా గుర్తు చేసుకున్నారు జయసుధ.

'డిప్రెషన్ చాలా బాధాకరమైన విషయం.. డిప్రెషన్‌లో ఆయన పీస్‌ని కోరుకున్నారు.. చివరికి ఆయన కోరుకున్న పీస్‌ ఆయనకు దొరికింది..' అంటూ సోషల్‌ మీడియాలో ఉద్వేగంగా వ్యాఖ్యానించింది జయసుధ. సరిగ్గా 32 ఏళ్ళ క్రితం ఇదే రోజు (మార్చ్‌ 17న) జయసుధ - నితిన్‌ కపూర్‌ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారట. ఆయన లేని లోటు తన జీవితంలో ఎప్పటికీ అలాగే వుంటుందనీ, అయితే ఇప్పుడాయన కోరుకున్న పీస్‌ ఆయనకు దొరికిందని జయసుధ చెప్పుకొచ్చింది. 

'నా భర్త ఎక్కడున్నా, మమ్మల్ని కాపాడుతుంటారు.. ఈ విషయంలో మీడియా సంచలనాలకు పోకుండా వ్యవహరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌..' అంటూ జయసుధ సోషల్‌ మీడియాలో పేర్కొంది. 

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ నటిగా జయసుధ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారామె. మానసిక సమస్యతో జయసుధ భర్త సతమతమవుతున్న విషయమే తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువమందికి.. అదీ అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసట. అన్నట్టు, నితిన్ కపూర్ కూడా నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన విషయం విదితమే. 

Show comments