సినీ నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్, నాలుగు వారాల క్రితం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - తెలంగాణ మంత్రి కేటీఆర్తో మంతనాలు జరిపారట. అది కూడా 'డిన్నర్ మీటింగ్'లోనట.! 'చేనేత' అంశంతోపాటు, ప్రస్తుత రాజకీయాలపైనా పవన్ - కేటీఆర్ మధ్య చర్చలు జరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా పవ్న్ కళ్యాణ్ ట్విట్టర్లో వెల్లడించారు.
పవన్కళ్యాణ్ ఈ మధ్యనే ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. ఆ లెక్కన ఆయన, తెలుగుదేశం పార్టీకి కూడా దూరమైనట్లే. 2019 ఎన్నికల్లో ఎటూ పోటీ చేయాలనే నిర్ణయానికి జనసేనాధిపతి వచ్చేసిన దరిమిలా, పార్టీని తెలంగాణలో విస్తరించే దిశగా (అసలంటూ పార్టీ నిర్మాణం ఎక్కడ జరిగింది గనక) కేటీఆర్తో జరిగిన చర్చల్లో ఏదన్నా 'మాట' ప్రస్తావనకు వచ్చిందా.? అనే గాసిప్స వచ్చేందుకు ఈ వ్యాఖ్యలు ఆస్కారం కల్పించాయన్నమాట.
నిజానికి టీఆర్ఎస్ - జనసేన మధ్య అంతగా పొసగని పరిస్థితినే చూస్తున్నాం. రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్యా విభేదాలే వున్నాయి. అసలు జనసేన అనే పార్టీని, రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ గుర్తించిన దాఖలాల్లేవు. కానీ, టీడీపీకి - బీజేపీకి పవన్ మద్దతిస్తున్న దరిమిలా, టీఆర్ఎస్ నుంచి ఆయనపైకి గతంలో ఘాటైన విమర్శలే దూసుకెళ్ళాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ - పవన్కళ్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
అయినా, రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. కాబట్టి, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరు ఎవరితోనైనా జతకట్టొచ్చు.. ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయొచ్చు. 'రాజకీయ చర్చలు' జరిగాయంటే, ఏమో.. రానున్న రోజుల్లో జనసేన - టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయేమో.! పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు'ని తిలకించాననీ, చేనేతను ప్రమోట్ చేస్తున్న పవన్కళ్యాణ్ని అభినందిస్తున్నాననీ కేటీఆర్ చెబితే, కేటీఆర్కి థ్యాంక్స్ చెబుతూ.. 'రాజకీయ అంశం' పవన్ తెరపైకి తీసుకురావడం విశేషమే మరి.