'బస్తీ మే సవాల్.. నేను డ్రగ్స్ తీసుకోలేదు, డ్రగ్స్తో నాకెలాంటి సంబంధాలూ లేవు.. డ్రగ్స్ తీసుకుంటే, ఆ ఆనవాళ్ళు నా బ్లడ్లో వుంటాయి కదా.. మీడియా సాక్షిగా నేను రెడీ.. ఎన్ని గంటలు పరీక్షిస్తారో పరీక్షించుకోండి.. ఇక్కడితో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చెయ్యాలంతే...' అంటూ డ్రగ్స్ కేసులో తన పేరు గురించి మీడియాలో వార్తలు రాగానే ఓ రేంజ్లో ఆవేశానికి గురయ్యాడు యువ నటుడు నందు.
'అసలు నాకు నోటీసులే రాలేదు..' అని గతంలో చెప్పిన నందు, నోటీసులు అందుకున్నాడు.. ఇప్పుడు విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే, ఇంతవరకు సినీ పరిశ్రమలో ఎవర్నీ నిందితులుగా తెలంగాణ ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కేసులో పేర్కొనలేదు. 'సినీ పరిశ్రమని వేధించట్లేదు.. డ్రగ్స్ తీసుకుంటే వారు బాధితులే అవుతారు.. నేరస్తులు కారు..' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చాక, అంతకు ముందు తెలంగాణ ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 'వాడినా నేరం చేసినట్లే..' అన్న మాటలకు విలువ లేకుండా పోయిందనుకోండి.. అది వేరే విషయం.
ఇక, ఈ రోజు ఉదయం విచారణకు హాజరైన నందు, 'సిట్' బృందానికి రక్త నమూనాలు, వెంట్రుకలు - గోళ్ళ నమూనాల్ని ఇస్తాడా.? ఇవ్వడా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా 'సిట్' వెల్లడించిన వివరాల ప్రకారం ఇద్దరు మాత్రమే తమ నమూనాల్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఛార్మి కోర్టును ఆశ్రయించాక, ఆ తర్వాత ఎవరూ శాంపిల్స్ ఇవ్వకపోవడం గమనార్హం. అప్పుడంటే ఏదో ఆవేశంలో అనేశాడుగానీ, ఇప్పుడు నందు శాంపిల్స్ ఇచ్చే అవకాశం లేదేమో.!