నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. తాజాగా వెంకటగిరి సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కోపం వచ్చింది.
ఇటీవల నెల్లూరు ఎస్పీపై కోవూరు ఎమ్మెల్యే , వైసీపీ సీనియర్ నేత ప్రసన్నకుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు చెబుతున్నట్టు నెల్లూరు ఎస్పీ నడుచుకుంటున్నారని, పద్ధతి మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ విషయాన్ని మరిచిపోకనే అదే జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి జిల్లా ఉన్నతాధికారులపై విరుచుకుపడ్డారు. నెల్లూరులో నిన్న నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్కు ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నెల్లూరులో రిపబ్లిక్ వేడుకలను కలెక్టర్ చక్రధర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ క్రమానికి జేసీలు హరేందిర ప్రసాద్, ప్రభాకర్రెడ్డి, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితర అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడంపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితులపై ఆయన తీవ్ర అసహనం, ఆక్రోశం వెళ్లగక్కారు. "రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు మాకు అర్హత లేదా? దీనికి మేము సిగ్గుపడాలో, ఏంచేయాలో అర్థం కాలేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అధికారుల తీరుపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. అంతేకాదు, రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించకుండా ఆవమానించిన అధికారులపై కేసులు వేస్తానని ఆయన హెచ్చరించడం రాజకీయ దుమారం రేపుతోంది.
దీంతో నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య మరోసారి లుకలుకలు బయట పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో కూడా అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.