ఆ ఒక్కటి అడక్కు.. శ్రీదేవి నయా స్టేట్ మెంట్

అతిలోకసుందరిగా ఇండియా మొత్తం పేరుతెచ్చుకున్న శ్రీదేవి కొత్త పల్లవి అందుకుంది. మీడియాను ఎప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చినా "ఆ ఒక్కటి అడక్కు" అంటూ తప్పించుకుంటోంది. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చినా, ప్రత్యేక సందర్భంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడాల్సి వచ్చినా.. "ఆ ఒక్కటి తప్ప" అనే కండిషన్ ను అమలు చేస్తోంది. ఇంతకీ ఆ ఒక్కటి ఏంటో తెలుసా బాహుబలి ప్రాజెక్టు.

అవును.. బాహుబలి సినిమా గురించి, మరీ ముఖ్యంగా అందులో శివగామి క్యారెక్టర్ గురించి అడగొద్దని మీడియాకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తోంది శ్రీదేవి. ఆ సినిమా గురించి తనకు మాట్లాడ్డం ఇష్టంలేదని అంటోంది. మరీ ముఖ్యంగా శివగామి పాత్రను ఎందుకు వద్దనుకున్నారు అనే ప్రశ్నను ఎదుర్కోవడం శ్రీదేవికి అస్సలు ఇష్టం లేదు. అప్పుడెప్పుడో 4 ఏళ్ల కిందటే ముగిసిన ఈ ముచ్చట ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడానికి కారణం రాజమౌళి.

బాహుబలి-2 బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో కాస్త ఓపెన్ గానే మాట్లాడాడు రాజమౌళి. అప్పటివరకు రాజమౌళి స్వరం వేరు, ఆ ఇంటర్వ్యూలో అతడి గొంతు వేరు. తనకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నాడేమో చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పేశాడు. శ్రీదేవి గొంతెమ్మ కోర్కెలు కోరిందని, హిందీ రెవెన్యూలో షేర్ కూడా అడిగిందని కుండబద్దలుకొట్టాడు. ఈ వార్త బాలీవుడ్ లో కూడా వైరల్ అయింది.

రాజమౌళి కామెంట్ చేసిన కొన్ని రోజులకే మామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాను ఫేస్ చేయాల్సి వచ్చింది శ్రీదేవికి. దీంతో మామ్ మూవీని పక్కపెట్టి అంతా రాజమౌళి స్టేట్ మెంట్ గురించి అడగడం మొదలుపెట్టాడు. దీంతో "ఆ ఒక్కటి తప్ప" అనే కండిషన్ పెట్టింది శ్రీదేవి. అన్నట్టు రాజమౌళి స్టేట్ మెంట్ తో టాలీవుడ్ నుంచి రెగ్యులర్ గా వినిపించే శ్రీదేవి జపం కాస్త తగ్గింది.

Show comments