జయకు నివాళి.. కమల్ హాసన్ వివాదాస్పద ట్వీట్

జయకు నివాళి ఘటిస్తూ నటుడు కమల్ హాసన్ పోస్టు చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఒకవైపు జయలలిత మృతి పట్ల ఆమె అభిమానులు, తమిళ ప్రజలు ఆవేదన భరితులైన వేళ కమల్ వారిని హేళన చేస్తున్నట్టుగా పెట్టిన ట్వీట్ పై వివాదం రేగుతోంది. కమల్ తీరును జయ అభిమానులు ఖండిస్తున్నారు. ట్విటర్ ద్వారానే విరుచుకుపడుతున్నారు.

ఇంతకీ కమల్ ఏమన్నాడంటే.. తమిళంలో పోస్టు చేసిన ఆ ట్వీట్ లో  కమల్ “జయలలిత మీద ఆధారపడి బతుకున్న వారి పట్ల తీవ్రమైన సానుభూతి..’’ అని పేర్కొన్నాడు. బహుశా.. జయలలిత సంక్షేమ పథకాలను హేళన చేస్తూ కమల్ ఇలా స్పందించి ఉండవచ్చు. లేదా.. మరేదైనా ఉద్దేశం ఉండవచ్చు. ఏదేమైనా.. ఇంకా అంత్యక్రియలైనా పూర్తి గాక ముందే.. ఇలాంటి స్పందన మాత్రం సమర్థించగలిగిన అంశం కాదు.

జయపై అభిమానిస్తున్న వారందరినీ.. ఆమెపై ఆధారపడ్డ వ్యక్తులు అనడం ఈ హీరోకి తగదు. ఈ విషయంలో అభిమానుల నుంచినే నిరసనను ఎదుర్కొంటున్నాడు కమల్. ‘నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నా..’’ అంటూ కమల్ ట్వీట్ కు రీ ట్వీట్లు చేస్తున్నారు ఆయన ఫాలోయర్లు.

ఈ సందర్భంలో జయతో కమల్ కు నెలకొన్ని కొన్ని విబేధాలు గుర్తురాకమానవు. ‘విశ్వరూపం’ సినిమా సమయంలో కమల్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందనే మాట వినిపించింది. అంతకు ముందు చిదంబరానికి అనుకూలంగా కమల్ మాట్లాడుతూ.. ‘పంచె కట్టిన వాడు.. ఈ దేశానికి ప్రధాని కావాలి..’ అని వ్యాఖ్యానించడంతో చీరకట్టు జయకు కోపం వచ్చిందని.. దానికే జయలలిత ‘విశ్వరూపం’ సమయంలో కమల్ కు విశ్వరూపం చూపిందనే మాట వినిపించింది. అయితే.. జయ ఆ ప్రచారాన్ని ఖండించింది. ప్రధానిగా ఎవరు ఉండాలో కమల్ నిర్ణయించడు కదా.. అలాంటప్పుడు తను ఎందుకు కక్ష సాధింపుకు పాల్పడతా? అని ఆమె ప్రశ్నించారప్పట్లో. 

Show comments