అగ్రిగోల్డ్ కుంభకోణానికీ, స్పీకర్ కోడెలపై సాక్షి కథనాలకీ సంబంధం ఏమన్నా వుందా.? చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు, ఇది జస్ట్ బ్లేమ్ గేమ్ అని. ఇంతకీ, ఈ బ్లేమ్ గేమ్లో అధికార తెలుగుదేశం పార్టీ బావుకున్నదేంటట.? అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ 'మీట్ ది ప్రెస్'లో ఏం చెప్పారో ప్రపంచమంతా చూసింది. ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చుగాక, 'కారు షెడ్లో వుంటే సేఫ్.. అలాగే అమ్మాయిలు కూడా..' అన్న కోడెల శివప్రసాద్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత, దానికన్నా ముందు కోడెల స్పీచ్లో చాలా విషయాలున్నాయి.
కానీ, 'కారు - షెడ్ - అమ్మాయిలు - బయట తిరగడం' అన్న వ్యవహారమ్మీదే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది. తెలుగు మీడియాలోనూ తక్కువ రచ్చ ఏమీ జరగలేదు. దాదాపుగా అన్ని ఛానళ్ళూ ఈ వ్యవహారాన్ని 'కవర్' చేసేశాయి.. విశ్లేషణలతో దంచికొట్టేశాయి. కానీ, ఇక్కడ కేవలం 'సాక్షి' మీదనే అధికార పార్టీ కత్తిగట్టేసింది.
కోడెల ఆ వ్యాఖ్యలు చేశారు.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఈ రోజు అసెంబ్లీలో ప్రదర్శించిన వీడియోలోనూ అదే కన్పించింది. ఇక, సాక్షి ఈ ఉదంతంపై నేషనల్ మీడియా, తెలుగు మీడియా ప్రసారం చేసిన కథనాల్ని ఉటంకిస్తూ మరో కథనాన్ని వండి వడ్డించింది తాజా తాజాగా. ఇప్పుడిక, అధికార పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందనే చెప్పాలి. సాక్షిని బ్యాన్ చేయాలనుకుంటే.. మొత్తంగా మీడియాని బ్యాన్ చేసెయ్యాలి. లేదంటే, అందర్నీ వదిలెయ్యాలి.
'నేషనల్ మీడియాకి వాస్తవం చెప్పాం.. వాళ్ళు ఆ కథనాల్ని ఆపేశారు..' అంటూ చంద్రబాబు, నాలిక్కర్చుకున్నారుగానీ.. ఈ బ్లేమ్ గేమ్ అచ్చంగా 'హిట్ వికెట్' లాంటిదేనని టీడీపీ నేతలకు అర్థమయిపోయింది. ఇప్పుడేమో ముందుకు వెళ్ళలేరు.. వెనక్కి రాలేరు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేసేశారు గనుక.. ఇది స్పీకర్ ఛెయిర్కి సంబంధించినంతవరకు 'ప్రెస్టీజ్ ఇష్యూ'గా మారిపోయింది.. కాదు కాదు, టీడీపీ అలా మార్చేసింది. కానీ, పరిస్థితులు అనుకూలించవాయె.!
సాక్షి మీద చర్యలు తీసుకోకపోతే.. స్పీకర్ ఆవేదనకు అర్థం వుండదు. చర్యలు తీసుకుంటే, మొత్తం మీడియా.. చంద్రబాబు సర్కార్ని ఏకి పారేస్తుంది.. నేషనల్ మీడియాతో సహా. నేషనల్ మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. చంద్రబాబు భలేగా ఇరికేశారిక్కడ.!