ఒక్క ప్రకటన...బోలెడు సందేహాలు

ఒక్కోసారి టాలీవుడ్ లో వున్నట్లుండి బయటకు వచ్చే ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తాయి. అనేక సందేహాలకు దారి తీస్తాయి. ఈ రోజు 14రీల్స్ ప్లస్ సంస్థ నుంచి వచ్చిన ప్రకటన ఇలాగే హడావుడి చేస్తోంది. తమ తరువాత సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ తో అని, వివరాలు లాక్ డౌన్ పూర్తయిన తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. 

అంతే, ఇక టాలీవుడ్ లో ఊహాగానాలకు లోటు లేదు. హరీష్ శంకర్ ఇప్పుడు మైత్రీ పతాకంపై నిర్మించే పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిటింగ్ లో వున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ ప్రకటన ఏమిటి? ఆ సినిమాకు ఏమైనా అయిందా? లేదా ఆ సినిమా లేటు అవుతుందని, ఈ లోగా హరీష్ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారా? అలా అయితే ఈ సినిమాకు హీరో ఎవరు? అయినా ఇలా వేరే సినిమా చేసుకుని వస్తానంటే పవన్ కళ్యాణ్ ఎలా ఫీల్ అవుతారు? 

హరీష్ కు ఎప్పటికైనా మహేష్ బాబుతో సినిమా చేయాలని కోరిక వుంది. 14రీల్స్ పతాకంపై అది సాధ్యం అయ్యే అవకాశం వుందని, అందుకే వాళ్లతో మలి సినిమా కమిట్ అయ్యారని మరో గ్యాసిప్.  

ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు. మరోపక్క, ఆ మధ్య, నిన్న ఇంటర్వ్యూలు ఇస్తూ నిర్మాత బండ్ల గణేష్ డైరక్టర్ హరీష్ శంకర్ మీద కొన్ని కామెంట్లు చేసారు. తాను ఎప్పటికీ హరీష్ తో సినిమా చేయను అన్నారు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ తో సినిమాకు తనలాంటి వారు ఎందరో రెడీ అంటూ నిర్మాత పివిపి ఓ ట్వీటు వేసారు. ఆ ట్వీటు పడిన సాయంత్రానికి 14రీల్స్ ప్లస్ ప్రకటన వచ్చింది. 

ఇవన్నీ కలిసి మొత్తం మీద డైరక్టర్ హరీష్ శంకర్ ను వార్తల్లో వుంచాయి. బండ్ల గణేష్ వేసిన బండలు పక్కకుపోయాయి. హరీష్ శంకర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఇవన్నీ బాగానే వున్నాయి. కానీ ఈ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుంటే, ఏ టర్న్ తీసుకుంటుందో అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే పవన్ సినిమా టేకప్ చేయడం వదలడం అన్నది పెద్ద క్వశ్చను కాదు. గతంలో మైత్రీ జనాలు డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ ను పవన్ కోసం దాదాపు ఏడాదికి పైగా తమ ఆస్థానంలో వుంచుకుని పోషించారని కూడా సినిమా జనాలు గుర్తు చేస్తున్నారు.

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

Show comments