ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02

1945 నుంచి 1947 వరకు కాలేజీలో బియ్యే చదివే రోజుల్లో ఎన్టీయార్‌ గుంటూరు నుంచి రైల్లో విజయవాడ వెళ్లేవాడు. బండి తప్పిపోతే రైలు పట్టాల మీద నడుచుకుంటూ విజయవాడ వెళ్లిన సందర్భాలున్నాయి. అప్పుడు భార్య హరికేన్‌ లాంతరు పట్టుకుని యింటి దగ్గర వెయిట్‌ చేసేదిట. 1947లో ఎల్వీ ప్రసాద్‌గారు 'శ్రీమతి' అనే సినిమా ప్లాను చేస్తున్నారు - అల్టిమేట్‌ గా తీయలేదనుకోండి - విజయవాడ వస్తే రామారావుగార్ని ఎవరో పరిచయం చేశారు. సినిమాల్లో వేస్తావా అంటే గ్రాజువేషన్‌ అయిపోయింది కాబట్టి సరేనన్నాడు. ఆయన మద్రాసుకి రమ్మన్నారు. స్క్రీన్‌టెస్ట్‌లు చేయించారు. మళ్లీ పిలుస్తాం ప్రస్తుతానికి వెళ్లమన్నారు.

ఈయన వెనక్కి వచ్చి నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ పేర నాటకాలు వేస్తూండేవారు. తర్వాత సినిమా నిర్మాణం ఎన్‌.ఏ.టి. పేర చేసేవారు కదా, దాని ఫుల్‌ ఫామే - నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌. ఉద్యోగాలకై ప్రయత్నాలు కూడా చేస్తూండేవారు. సర్వీస్‌ కమీషన్‌కి పరీక్ష రాస్తే సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరుదామా లేదా అనుకుంటూండగానే జాబు వచ్చింది ఎల్వీ ప్రసాద్‌గారి వద్దనుండి.  'శ్రీమతి ఆగిపోయింది, 'మనదేశం' తీస్తున్నాను. అందులో చిన్నవేషం వుంది. వచ్చి వేయండి' అని. 'హీరో అని చెప్పి చివరికి చిన్నవేషం వేయడమేమిటి?' అనుకుని ఈయన సినిమా ఆశ వదిలేసి ఉద్యోగంలో చేరాడు. చేరాడే కానీ ఈయన దానిలో పని చేసినది 11 రోజులు మాత్రమే! దానికో కారణం వుంది.

ఎన్టీయార్‌ది చిన్నప్పటినుండీ కష్టపడి పనిచేసే రైతు కుటుంబం. ఈయన చేరినదేమో అవినీతికి ఆలవాలమైన రిజిస్ట్రార్‌ ఆఫీసు. ఆఫీసులో చేరిన మొదటిరోజున ఈయన కోటు విప్పి కుర్చీకి తగిలించి పని చేసుకున్నాట్ట. సాయంత్రానికి కోటు జేబు బరువుగా వుందట. చూస్తే లంచం డబ్బు! ఆఫీసు బంట్రోతు ఆరోజు ట్రాన్సాక్షన్స్‌లో ప్రతి వాడి వాటా కోటులో పడేసి వెళ్లేవాట్ట. ఇది చూడగానే ఈయన గంగవెర్రులెత్తిపోయాడు. నాకు వద్దు పొమ్మన్నాడు. దెబ్బకి ఆఫీసులో కొలీగ్స్‌ అందరికీ శత్రువై పోయాడు. ఇలాటివాడు తమ మధ్య వుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు. ఇలాటి హోస్టయిల్‌ వాతావరణం ఆయనకు పడలేదు. పైగా ఓ కొలీగ్‌ 'మేమందరం ధైర్యం చేయలేక ఇక్కడే పడి కొట్టుకుంటున్నాం. నీకు రూపం వుంది, సాహసం వుంది. సినిమా రంగానికి వెళ్లు' అని నూరిపోశారు.

అలా ఎందుకన్నారంటే అప్పుడే ఎన్టీయార్‌కి బిఏ సుబ్బారావు గారి వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆయన అప్పుడే పైకి వస్తున్న  దర్శకుడు. 'పల్లెటూరి పిల్ల' సినిమా ప్లాను చేస్తూ ఎల్వీ ప్రసాద్‌గార్ని సలహా అడిగాట్ట. ఆయనేమో ఈయన్ని రికమెండ్‌ చేశారు. 'మద్రాసు రండి' అని బియే సుబ్బారావు ఉత్తరం రాశారు. చివరకి కొలీగ్‌ సలహా విని ఎన్టీయార్‌ మద్రాసు రైలెక్కారు. మద్రాసు వెళుతూనే ఎల్వీ ప్రసాద్‌ దగ్గరకు వెళ్లి 'నాకు హీరో వేషం యివ్వలేదేం? నేను దానికి తగనా?' అని నేరుగా అడిగేశారు. అదీ ఆయన స్టయిల్‌. జీవితమంతా ఆయన సమస్యలను ఎదుర్కోవడంలో అదే స్టయిల్‌ పాటించారు. దాపరికం లేదు. డైరక్టుగా తలపడడమే! ప్రసాద్‌గారు 'కాలం కలిసిరాలేదు. ఈలోపున సుబ్బారావుగార్ని కలవండి' అన్నారు.

ఈయన స్టూడియోకి వెళ్లి సుబ్బారావుగార్ని కలిశారు. ఎన్టీయార్‌ని వస్తూండగానే దూరం నుండి చూసి సుబ్బారావు గారు 'ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను' అనుకున్నారు. ఈయన దగ్గరకు వెళ్లి 'నేను ఫలానా' అనగానే 'అయితే నువ్వే నా హీరోవి' అన్నారు. మేకప్‌ టెస్ట్‌ లేదు, వాయిస్‌ టెస్టు లేదు, ఏమీ లేదు. వెయ్యినూట పదహార్లు అడ్వాన్సు యిచ్చి బుక్‌ చేసేసుకున్నారు. ఎల్వీ ప్రసాద్‌ మొత్తుకున్నారు. చాలా రిస్కు తీసుకుంటున్నావని హెచ్చరించారు. 'పోనీ నా 'మనదేశం'లో చిన్న వేషం యిచ్చి చూస్తా. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలుస్తుంది' అన్నారు. సుబ్బారావు గారు వింటేగా? అబ్బే అదేం అక్కరలేదు అన్నారు. కానీ ఎల్వీ ప్రసాద్‌గారు ఎన్టీయార్‌కి మనదేశంలో చిన్న వేషం యిచ్చారు. అదీ విలనిక్‌ వేషం. దేశభక్తులపై విరుచుకుపడే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషం. తొలివేషం హీరోకాదే అనుకుంటూనే ఎల్వీ ప్రసాద్‌గారి మీద గౌరవం కొద్దీ ఎన్టీయార్‌ వేషం ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఆయన పాత్రలో జీవించేశాడు.

పాత్రలో జీవించడం అనేది మామూలుగా చాలామంది విషయంలో అనేస్తాం కానీ ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఎన్టీయార్‌ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఎయన్నార్‌ ఎప్పుడూ అంటారు - మనం పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవకూడదు. లేకపోతే బాలన్స్‌ తప్పుతాం. పాత్రలో లీనమయినట్టు నటించాలి. మనం వేరేగా వుండి మన పాత్రను గమనించాలి. అని. కానీ ఎన్టీయార్‌ పద్ధతి అది కాదు. అది మొదటి సినిమాలోనే తెలిసింది. ఆయనది ఇన్‌స్పెక్టర్‌ వేషం అని చెప్పాను కదా, స్వాతంత్య్రవీరులపై లాఠీచార్జి చేయడం సీను. జూనియర్‌ ఆర్టిస్టులను కొంతమందిని తీసుకువచ్చి 'వీళ్లు స్వాతంత్య్ర యోధులు' అన్నారు. 'యాక్షన్‌' అనగానే ఈయన వాళ్ల మీద పడ్డాడు. నిజంగానే చితక్కొట్టేశాడు. వాళ్లు బాబోయ్‌ బాబోయ్‌ అన్నా వినలేదు. తరిమి తరిమి కొట్టాడు.

వాళ్లు బెదిరిపోయి స్టూడియో గేటు దాకా పారిపోయినా ఈయన వెంట పడి మరీ కొట్టాడు. డైరక్టరుగారు తిట్టిపోశారు - ఏమిటయ్యా నిజంగానే కొట్టావ్‌! అని. 'పోలీసులు నిజంగానే కొడతారు కదా సార్‌' అని ఈయన జవాబు. జూనియర్‌ ఆర్టిస్టులు కాబట్టి ప్రతాపం చూపించాడు, అదే తనైతేనా? అని అనుకోవద్దు. 'పల్లెటూరి పిల్ల'లో హీరో అని చెప్పాను కదా, అందులో అంజలిచేత చెంపదెబ్బ తినే సీను వుంది.  ఆవిడ లాగి కొట్టినా డైరక్టరుగారు టేకు ఓకే చేయలేదు. మళ్లీ, మళ్లీ... తొమ్మిదిసార్లు కొడితే తప్ప టేకు ఓకే కాలేదు. మధ్యలో ఆవిడ 'కొత్తబ్బాయండి, పాపం' అన్నా ఎన్టీయార్‌ 'ఏం ఫర్వాలే, కొట్టండి' అని ఎంకరేజ్‌ చేశారు. చివరికి చెంప ఎర్రగా కందిపోయింది.

'పల్లెటూరి పిల్ల' సినిమాలో కోడె దూడతో పోట్లాడే దృశ్యం వుంది. డూప్‌ను పెడతానంటే వద్దని ఈయనే రంగంలోకి దిగాడు. ఎద్దు చూడబోతే బలిష్టమైన ఆస్ట్రేలియా గిత్త! శుబ్బరంగా ఎన్టీయార్‌ను ఎత్తి కుదేసింది. దెబ్బకి ఈయన కుడిచేతి మణికట్టు విరిగింది. ఆసుపత్రిలో కొన్నివారాలుండి చివరకు పుత్తూరు వైద్యంతో బాగు చేయించుకున్నారు. మళ్లీ కొన్నిరోజులకు తెల్లవారు ఝామున షూటింగ్‌ అయి నిర్మాత కారులో యింటికి వస్తూ వుంటే యాక్సిడెంటు అయి ఆ చేతికే దెబ్బ తగిలింది మళ్లీ. కట్టు కనబడకుండా ఫుల్‌హేండ్‌ చొక్కా వేసుకుని యాక్ట్‌ చేసేశాడీయన.

ఇదంతా తొలిరోజుల మోజు అనుకోకండి. చివరిదాకా అలాగే వున్నాడాయన. స్టంటు సినిమాల్లో నిజంగానే పోట్లాడేవారు. విలన్లను పట్టుకు చావగొట్టేవారు, వాళ్ల చేతిలో దెబ్బలు తినేవారు. గులేబకావళి సినిమాలో పొట్టి కత్తులతో పోట్లాడినప్పుడు గీరుకు పోయేవిట. 'కృష్ణావతారం' సినిమా గురించి ఓ సంఘటన చెప్తారు. రాయబారం సీనులో 'యుద్ధమంటూ జరిగితే భీమసేనుడు నీ తొడలు విరక్కొడతాడు చూసుకో' అంటూ దుర్యోధనుణ్ని హెచ్చరిస్తూ పద్యం పాడే సీనులో ఎఫెక్టు కోసం చేతిలో వేణువు తొడమీద కొట్టుకుంటూ పద్యం పాడారు ఎన్టీయార్‌. అయితే గొడవేమిటంటే అది మామూలు చెక్క ఫ్లూటు కాదు. స్టీలుది. కొన్ని టేకులు తీసుకుని మొత్తంమీద సీను ఓకే చేయించుకుని మేకప్‌ తీసేసి బట్టలు మార్చుకుంటూ వుంటే అప్పుడు కనబడ్డాయి తొడమీద ఫ్లూట్‌ గీతలు. ఎర్రగా రక్త గడ్డకట్టేట్టు కొట్టేసుకున్నాడీయన. అది తెలియను కూడా తెలియలేదు పెద్దమనిషికి.

భూకైలాస్‌ సినిమాలో వేసినప్పుడు రావణాసురుడు వేషం ఈయనది. రావణుడు తపస్సు చేస్తున్న సీను తీస్తూండగానే లంచ్‌ బ్రేక్‌ వచ్చింది. గడ్డాలూ, మీసాలూ పెరిగివుంటాయి, చుట్టూ మట్టితో కట్టిన పుట్ట. లంచ్‌కి లేస్తే ఈ పుట్టలన్నీ పాడయిపోతాయి. మళ్లీ కట్టాలి. 'ఎందుకులెండి, మళ్లీ లేవడం, కట్టడం, ఈ పూటకు భోజనం మానేస్తాను' అన్నాడీయన. డైరక్టరు నొచ్చుకుని నచ్చచెప్పబోయినా ఎన్టీయార్‌ వినలేదు. అసలు అంతకుముందు సినిమాల్లో రాజుల కిరీటాలంటూ అట్టకిరీటాలు పెట్టేవారు. ఈయన కాలం వచ్చేసరికి లోహపు కిరీటాలు వచ్చాయి. ఈయన కిరీటం పెట్టుకుని కూచుంటే లంచ్‌ టైములో కూడా తీసేవాడు కాదుట. మేకప్‌ చెదిరిపోతుందనేమో. 'కర్ణ' సినిమా తీసిన టైములో గంటల తరబడి కిరీటం పెట్టుకుని వుండడంతో నుదుటిమీద మచ్చ పడిపోయింది పాపం. 'చిరంజీవులు' సినిమాలో ఎన్టీయార్‌ది గుడ్డివాడి పాత్ర. ఆ ఎఫెక్టు రావడానికి కళ్లల్లో ఏవో పెట్టుకోమనేవారట. అవి పెట్టుకుంటే కళ్లు మంటలు. అయినా ఈయన కిమ్మనేవాడు కాదు. రోజుల తరబడి పెట్టుకుని కళ్లమంటలు భరించేవాడు, కళ్ల వెంబడి నీళ్లు కారినా డోంట్‌కేర్‌.

ఈ ట్రెండ్‌ యౌవనంలోనే కాదు, ముసలితనంలో కూడా కంటిన్యూ అయింది. 'చండశాసనుడు' సినిమా తీసేనాటికి 1983 నాటిది. అంటే అప్పటికి ఈయనకు 60 యేళ్లు. ఆ సినిమా షూటింగు టైములో ఈయన ఛాతీమీదనుండి బండి వెళ్లిపోయింది. ఈయన చెక్కు చెదరలేదు. షూటింగు ఆపేయలేదు.పనిలో ఆయన రాక్షసుడు. కుయ్‌కయ్‌మనకుండా చేసేవాడు. చిక్కెక్కడంటే  అందర్నీ అలాగే వుండమనేవాడు. వాళ్లంతా గొల్లుమనేవారు. వాళ్లంతా ఆయనలా తెల్లవారు ఝామున రెండు గంటలకూ లేవలేరు. సూర్యోదయం కాకుండానే అరకోడి కూర లాగించనూ లేరు. ఆయన బ్రహ్మాండంగా తినేవాడు. కావాలంటే రోజుల తరబడి అన్నం మానేసేవాడు. రావణుడి వేషం వేసేటప్పుడు రెండు పూటలా నాన్‌వెజ్‌ తీసుకునేవారు. రాముడి వేషం వేసినప్పుడు మొత్తం మానేసేవారు. లాజికల్‌గా ఆలోచిస్తే యిది అనవసరం. ఎందుకంటే ఒరిజినల్‌ రాముడు కూడా నాన్‌వెజిటేరియనే కదా. క్షత్రియుడు. యుద్ధం చేయవలసినవాడు. అందువల్ల నాన్‌ వెజ్‌ తినేవాడే. కానీ ఆయన వేషం కట్టినరోజుల్లో ఈయన నాన్‌వెజ్‌ ముట్టుకునేవాడు కాదు.

ఎందుకలా అంటే రాముణ్ని ఊహించినప్పుడు మనకు క్షత్రియుడు, రాజు కనబడడు. ఒక దైవాంశ సంభూతుడు కనబడతాడు. ఆ ప్రసన్నత, దైవాంశ కనబడాలంటే సౌమ్యంగా వుండాలని ఎన్టీయార్‌ వూహ. అందుకే ఆ నియమనిష్ఠలు. అలాగే దుష్టపాత్రలు వేసినపుడు ఎన్టీయార్‌ విపరీతంగా తినేవారట. ఇంకో విషయం కూడా వుంది. ఛాతీ మీద వెంట్రుకలు లేకుండా తీసేసేవారు. కండలు తిరిగినట్టు కనబడకుండా, కేవలం బలిష్టంగా మాత్రం కనబడేట్లా ప్రాణాయామం చేసేవారుట. పళ్లు గారపట్టకూడదని కిళ్లీ వేసుకునేవారు కాదట. ఈ జాగ్రత్తల వలననే ఆయన మనకు దేవుడికి ప్రతిరూపంలా అనిపించి వుంటాడు. నార్త్‌ యిండియాలో వాళ్లు యిలాటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందువల్ల వాళ్లు ఎంతబాగా నటించినా నటిస్తున్నారనే అనుకున్నాం తప్ప దేవుడు దిగి వచ్చాడని అనుకోలేక పోయాం.

ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి 'న భూతో.. యిప్పట్లో న భవిష్యతి' అని ధైర్యంగా చెప్పగలం. నాగేశ్వరరావుగారితో పోలిక వచ్చినపుడు నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతోకొంత దూరంలో నాగేశ్వరరావుగారి స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్‌ పౌరాణిక పాత్రల దగ్గరకి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకంటున్నానంటే కాంతారావుగారూ కృష్ణుడు వేశారు, హరనాధ్‌ వేశారు. బాగానే వేశారు. 'సంపూర్ణరామాయణం'లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడుగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు.

రామారావు తొలి పౌరాణికం 'మాయారంభ'. మాయాబజార్‌ ఆయన రెండో పౌరాణికం. కృష్ణుడుగా ఆయన కేలండర్ల కెక్కినది ఆ సినిమాతోనే. అప్పటిదాకా కృష్ణుడంటే ఈలపాట రఘురామయ్య గారే. కెవి రెడ్డిగారు ఈయనకు కృష్ణుడి వేషం యిచ్చి కిరీటం స్టయిల్‌ మార్పించారు. ఫుల్‌ క్రౌన్‌ పెట్టారు. అందులో నెమలి ఈకల గుత్తి పెట్టారు. ఈయన ఛాతీ కనబడేట్టు చూశారు. మేకప్‌ పూర్తి చేసి బయటకు తీసుకొచ్చేసరికి అందరూ ఈయన అందానికి 'వాహ్‌' అన్నారు. ఎన్టీయార్‌కి ధైర్యం, ఆత్మవిశ్వాసం వచ్చాయి. ఇక అప్పణ్నుంచీ కృష్ణుడంటే ఎన్టీయారే అనుకునే స్థితికి తీసుకు వచ్చారు. మన తెలుగువాళ్లకు నిజం కృష్ణుడు ప్రత్యక్షమైనా అతను ఎన్టీయార్‌ పోలికల్లో లేకపోతే నువ్వెవరో మాకు తెలియదు పొమ్మంటాం. కృష్ణుడిగా ఆ చిరునవ్వు, కొంటెతనం లెజెండరీ అయిపోయాయి. 
(సశేషం) (ఫోటోలు - ఎల్వీ ప్రసాద్‌, బిఏ సుబ్బారావు)

మొదటిభాగం కింద ఉన్న వ్యాఖ్యలు చూశాను. ఎన్టీయార్‌కు విపరీతంగా కులాభిమానం ఉన్నట్లు, సినిమాల్లో, రాజకీయాల్లో  కులానికే ప్రాధాన్యత యిచ్చినట్లు కొందరు ఆరోపించారు. కులస్పృహ ఎక్కువై పోయిన యీ రోజుల్లో యిలాటి ఆరోపణలు విచ్చలవిడిగా చేస్తున్నారు, చాలామంది వాటిని నమ్ముతున్నారు కూడా. కాస్త నిదానించి ఆలోచిస్తే వీటిల్లో నిజానిజాలు బోధపడతాయి. ఎయన్నార్‌, ఎన్టీయార్‌ కలిసి తెలుగు సినీరంగాన్ని కమ్మమయం చేసేశారని, తక్కిన హీరోలందరినీ తొక్కేశారనీ కొందరు అనేస్తూంటారు. తర్వాతి రోజుల్లో వాళ్లు అగ్రహీరోలు కావచ్చు కానీ తొలి దినాల్లో తక్కిన హీరోలను తొక్కే స్థాయి కలవారు కాదు. పైగా అప్పట్లో నిర్మాతలు, దర్శకులదే పైచేయి. వాళ్లను శాసించే స్థితిలో హీరోలు ఉండేవారు కాదు.

1951-60 దశకంలోనే వీళ్లిద్దరూ కాక అనేకమంది హీరోలు ఉండేవారు. నాగయ్య, నారాయణరావు, రఘురామయ్య, రంజన్‌, రామశర్మ, రామచంద్ర కాశ్యప, అమరనాథ్‌, జగ్గయ్య, కాంతారావు, రమణమూర్తి, బాలయ్య, హరనాథ్‌, రామకృష్ణ, చలం.... వీరిలో కమ్మేతరులు అనేకమంది ఉన్నారు. వీళ్లందరి గురించి యీనాటి మీడియాలో ఎక్కువగా ప్రస్తావించరేం అనే దానికి సమాధానంగా, వీళ్లిద్దరూ హీరోలుగా వెలిగినంత ఎక్కువ కాలం వాళ్లు వెలగలేదు కాబట్టి అనుకోవాలి. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా లక్షణాలు కలిగి ఉండాలి, బయటనుంచి చాలా అంశాలు కలిసి రావాలి. కులంతో నెగ్గుకు వద్దామంటే లాభం లేదు.

ఇక ఎయన్నార్‌, ఎన్టీయార్లకు కులాభిమానం ఉన్నదీ లేనిదీ తేల్చాలంటే వాళ్లు డిక్టేట్‌ చేసే స్థితికి వచ్చాక వేసిన సినిమాల దర్శకులెవరు, నిర్మాతలెవరు, సహనటీనటులెవరు అనేది పరిశీలించాలి. ముఖ్యంగా వారి సొంత సినిమాల్లో సాంకేతికగణం (రచయితలు, గీతరచయితలు, సంగీతదర్శకులు, దర్శకులు, ఫోటోగ్రాఫర్లు వగైరా) ఎవరో చూస్తే కులాభిమానం ఉందో లేదో మనకే తెలిసిపోతుంది. లోకంలో ప్రతి చోటా ఉండేట్లుగానే సినీరంగంలోనూ ప్రతిభకు, పనితీరుకి పట్టం. మనం యిస్తున్న, లేదా యిస్తామని చెప్పిన మొత్తానికి మనం మెచ్చే విధంగా పనిచేసి పెడుతున్నాడా లేదా, మనిషిలో ప్రొఫెషనలిజం ఉందా లేదా అనేదే చూస్తారు.

ఇక హీరోలు తమ పక్కన ఉన్నవారు టాలెంటు కలిగి వుండి, తమని డామినేట్‌ చేయకుండా ఉన్నారా లేదా అని చూసుకుంటారు. ఎన్టీయార్‌, ఎయన్నార్‌లది ఒకే కులమైనా, కొన్నేళ్లపాటు విపరీతంగా వ్యతిరేకించుకున్నారు కదా. ఎన్టీయార్‌-కృష్ణ విషయంలోనూ అంతేగా. కాంతారావైతే తనకు పోటీగా ఉండడు కాబట్టి ఆయన తన కులం కాకపోయినా, ఎన్టీయార్‌ బాగా ప్రోత్సహించారు. (కింది లింకు చూడండి) తర్వాతి రోజుల్లో సత్యనారాయణను అలాగే ప్రోత్సహించారు. గుమ్మడి ఎయన్నార్‌ గ్రూపు అనే భావంతో ఎన్టీయార్‌ ఆయన్ని దూరంగా పెట్టి ఎస్వీయార్‌కు ప్రాధాన్యత యిచ్చారు.

సినీపరిశ్రమ విజయాన్ని ఆరాధించినట్లుగా, కులాన్ని ఆరాధించదు. బొత్తిగా తెలియనివాళ్ల కంటె ఎవరైనా బంధువుల లేదా స్నేహితుల ద్వారా వస్తే కొద్దిపాటి ఛాన్సు యిచ్చి పరీక్షిస్తారు. పనితీరు నచ్చకపోతే పంపించివేస్తారు. పనితీరు నచ్చినా, తెరమీద కనబడినపుడు ప్రేక్షకులు ఆదరించకపోతే సాగనంపుతారు లేదా వ్యక్తిగత సహాయకుడిగా ఉంచుకుంటారు. అంతే తప్ప, తన కులస్తుడు కదాని ప్రేక్షకుల మీద పదేపదే రుద్దుదామని చూడరు. ఇక ప్రేక్షకులు తామిచ్చిన టిక్కెట్టు డబ్బులు కిట్టుబాటు అయ్యాయా లేదా అనే చూస్తారు తప్ప నటుడిది సూర్యవంశమా, చంద్రవంశమా అనేది పట్టించుకోరు.

తెలుగుసినిమా రంగంలో ఏ నటుడు ఏ కులంవాడో గతంలో తెలిసేది కాదు. ఇటీవలి కాలంలోనే దాని గొడవ ప్రారంభమైంది. దీనివలన లాభమేమిటో ఎవరికీ తెలియదు. డబ్బింగు సినిమాల వద్దకు వచ్చేసరికి కులప్రస్తావన లేకుండానే హిట్టవుతున్నాయి కదా. రజనీకాంత్‌, విజయకాంత్‌, కమలహాసన్‌, అర్జున్‌, విక్రమ్‌, సూర్య, విజయ్‌.. యిత్యాది అనేకమంది హీరోల కులాల గురించి సగటు తెలుగు ప్రేక్షకుడికి తెలుసా? పట్టించుకుంటున్నాడా? ఇక హీరోయిన్ల కులాల గురించి ఎప్పుడూ ప్రస్తావనకు రాదు, అయినా వాళ్లను చూడడానికి ప్రేక్షకులు ఎగబడటం లేదా? అందువలన, యీ కులాల కొట్లాట సోషల్‌ మీడియాకు మాత్రమే పరిమితమనుకోవాలి.

రాజకీయాల్లో ఎన్టీయార్‌ కులాభిమానం ప్రదర్శించారా లేదా అనేది తర్వాత రాస్తాను.

సినీ స్నిప్పెట్స్‌: ఏ నిమిషానికి ఏ గతుకో ఎవరూహించగలరు...

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
mbsprasad@gmail.com

Show comments