టీటీడీ బోర్డుపై కన్నేసిన జనసైనికుడు!

తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘనమైన మెజారిటీతో గెలుపును సొంతం చేసుకుని ఉండొచ్చు గాక.. కానీ.. తొలుత ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ‘ప్రత్యేక కారణాలు’ ఉండడం వల్ల.. చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండిన వైసీపీ నేతను ఫిరాయింపజేసి తమ పార్టీలో కలుపుకుని, తీసుకువచ్చి తిరుపతి టికెట్ కట్టబెట్టారు పవన్ కల్యాణ్. ఆ సందర్భంలో పార్టీలో అనేక చికాకులు పుట్టాయి. వ్యతిరేకత పెల్లుబికింది. అన్నింటినీ పవన్ నెమ్మదిగా సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏం హామీలు ఇచ్చారో గానీ.. అక్కడి జనసైనికుడు మాత్రం టీటీడీ బోర్డు పదవి మీద కన్నేసినట్టుగా కనిపిస్తోంది.

చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులును తిరుపతి ఎమ్మెల్యేగా ప్రకటించిన సమయంలో కాపు కుల ఫ్యాక్టర్ ను ఆయన ప్రధానంగా నమ్ముకున్నారు. అంతవరకు ఓకే గానీ.. తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఇన్నేళ్లపాటు పార్టీని నిలబెట్టిన జనసైనికుల గురించి మరిచిపోయారు. తమకు టికెట్ వస్తుందని అనుకున్న వారి ఆశలు ఎంత భంగపడ్డాయో పట్టించుకోలేదు.

మొత్తానికి వారికి ఏయే మాటలు చెప్పి బుజ్జగించారో తెలియదు గానీ.. అంతా సద్దుమణిగింది. అందరూ కలిసి పనిచేశారు. పార్టీ గెలిచింది. తీరా ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరానికి వేళైంది. చంద్రబాబునాయుడు నామినేటెడ్ పోస్టుల మీద కసరత్తు ప్రారంభించారు. త్వరగానే అన్ని పోస్టులూ భర్తీచేసేస్తాం అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి టికెట్ మీద ఆశ పెట్టుకున్న జనసైనికుడు కిరణ్ రాయల్ టీటీడీ బోర్డు సభ్యత్వం మీద కన్నేసినట్టుగా కనిపిస్తోంది.

తిరుమల తరుపతి దేవస్థానాలకు సంబంధించి గతంలోనూ అనేక పోరాటాలు చేసిన చరిత్ర కిరణ్ రాయల్ కు ఉంది. టీటీడీ వ్యవహారాల్లో ఏ చిన్న లోపం బయటపడినా తిరుపతి నుంచి గట్టిగా గళం వినిపించిన జనసైనికుడు ఆయన ఒక్కరే. ఆ అనుభవం కూడా కలిసి.. టీటీడీ బోర్డు సభ్యత్వానికి తనను ఎంపిక చేయాలని పవన్ ను కోరుతున్నట్టుగా తెలుస్తోంది. Readmore!

టీటీడీ బోర్డు సభ్యత్వం అంటే ఎమ్మెల్యే పదవితో సమానంగా నాయకులు భావిస్తుంటారు. కానీ జనసేన కోటాలో టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం పవన్ వద్ద ఒత్తిడి తేగల వారు ఇంకా చాలా మందే ఉంటారు. గతంలో పవన్ అన్నయ్య నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేస్తారనే పుకార్లు కూడా వచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Show comments