భరోసా నిధుల కోసం రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడడంతో రైతులు దుక్కులు దున్నుకుని పంటల సాగుకు సిద్ధమయ్యారు. మరోవైపు పెట్టుబడి పెట్టేందుకు చంద్రబాబు ప్రకటించిన రైతు భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. గతంలో జగన్ సర్కార్ ప్రతి ఏడాది ఈ సమయానికి రైతు భరోసా సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో వేసేది. పీఎం కిసాన్ నిధుల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఇక చంద్రబాబు సర్కార్ అందించే సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. మరోవైపు పంటల సాగు సమయంలో రైతు భరోసా సాయం అందించాలంటూ రైతు సంఘాలు కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారని, దీన్ని ఎన్ని విడతల్లో ఇస్తారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసా సొమ్ము కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఉద్యమిస్తూ కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ ముందూవెనుకా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.