తిరుమలలో ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు మూడు, నాలుగు రోజులుగా విస్తృత సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా? అనే చర్చకు తెరలేచింది. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారిగా ధర్మారెడ్డి గుర్తింపు పొందారు. ఇటు సొంత పార్టీ నేతలు, అటు ప్రతిపక్షాల నేతలు సమాన స్థాయిలో వ్యతిరేకించే అధికారి ఎవరైనా ఉన్నారా? అంటే... ధర్మారెడ్డి పేరే వినిపిస్తోంది.
తిరుమలలో దర్శనాల విషయంలో ధర్మారెడ్డి ఒంటెత్తు పోకడలతో వ్యవహరించారనే విమర్శ బలంగా వుంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నేరుగా పరిచయం వుండడం, ఆయన చెప్పిందే వేదంగా వుండడంతో తిరుమలలో ధర్మారెడ్డి ఆడిందే ఆట , పాడిందే పాటగా కొనసాగింది. తనకిష్టమైతే ఎవరికైనా దర్శనం, లేదంటే ఏడ్పించడం.. ఇలా సాగింది ధర్మారెడ్డి పాలన అని వైసీపీ ప్రజాప్రతినిధులే ఎన్నో సార్లు బహిరంగంగా విమర్శలకు దిగారు.
ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి ఎక్కువ మంది శత్రువుల్ని సంపాదించుకున్నారు. గతంలో ఈవోగా వ్యవహరించిన తీరే, ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తోందని కూటమి నేతలు అంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సివిల్ వర్క్స్, దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకలు జరిగాయా?... ఇలా ఐదేళ్లలో తిరుమలలో ఏం జరిగిందనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మారెడ్డి టార్గెట్గా చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో ధర్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోపు ఆయన్ను ఏదైనా కేసులో ఇరికించొచ్చని కూటమి నేతలు చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి.ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమలలో సోదాలు!