కోహ్లికి ఖేల్‌రత్న.. సిక్కి రెడ్డికి అర్జున

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అందుకోనున్నాడు. 2018 సంవత్సరానికి గానూ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది.  తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికే అర్జున అవార్డు ఖాయమైంది. తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్పెషలిస్ట్‌ ప్లేయర్‌  సిక్కి రెడ్డి అర్జున అవార్డు పురస్కారం అందుకోనున్నారు.

ఈ క్రీడా పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాకారులు అందుకోనున్నారు.

ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు ఎంపికైనది వీరే..

రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న: విరాట్‌ కోహ్లి (క్రికెట్‌), మీరాబాయి చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌). 

అర్జున అవార్డు: నేలకుర్తి సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), హిమ దాస్‌ (అథ్లెటిక్స్‌), స్మృతి మంధాన (క్రికెట్‌), సవిత పూనియా (హాకీ), రాహీ సర్నోబాత్‌ (షూటింగ్‌), శ్రేయసి సింగ్‌ (షూటింగ్‌), మనిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌), పూజా కడియాన్‌ (వుషు), నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌), రోహన్‌ బోపన్న (టెన్నిస్‌), జి. సత్యన్‌ (టేబుల్‌ టెన్నిస్‌), జిన్సన్‌ జాన్సన్‌ (అథ్లెటిక్స్‌), సతీశ్‌ కుమార్‌ (బాక్సింగ్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), అంకుర్‌ మిట్టల్‌ (షూటింగ్‌), సుమీత్‌ (రెజ్లింగ్‌), రవి రాథోడ్‌ (పోలో), శుభాంకర్‌ శర్మ (గోల్ఫ్‌), అంకుర్‌ ధామ (పారాథ్లెటిక్స్‌), మనోజ్‌ సర్కార్‌ (పారా బ్యాడ్మింటన్‌). 

ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జ్యోత్‌ తేజ (ఆర్చరీ), ఎస్‌.ఎస్‌.పన్ను (అథ్లెటిక్స్‌), సి.ఎ.కుట్టప్ప (బాక్సింగ్‌), విజయ్‌ శర్మ (వెయిట్‌ లిఫ్టింగ్‌), ఎ. శ్రీనివాసరావు (టేబుల్‌ టెన్నిస్‌) క్లారెన్స్‌ లోబో (హాకీ), తారక్‌ సిన్హా (క్రికెట్‌), జీవన్‌ కుమార్‌ శర్మ (జూడో), వి.ఆర్‌.బీడు (అథ్లెటిక్స్‌). 

ధ్యాన్‌చంద్‌ అవార్డు: సత్యదేవ్‌ ప్రసాద్‌ (ఆర్చరీ), భరత్‌ చెత్రి (హాకీ), బాబీ అలోసియస్‌ (అథ్లెటిక్స్‌), దత్తాత్రేయ దాదూ చౌగ్లే (రెజ్లింగ్‌).    

Show comments