జగన్ మాస్టర్ ప్లాన్.. తిరిగి వాళ్లకే మంత్రి పదవులు?

మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనివార్యమనే విషయం తేలిపోయింది. తమ పదవులు పోతున్నాయనే విషయం కూడా కొందరు మంత్రులకు తెలిసిపోయింది. దీంతో టీడీపీ గోతికాడ నక్కలాగ ఎదురుచూస్తోంది. అసంతృప్త మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని తనవైపు తిప్పుకోవడానికి, తనకు ఎంతో అలవాటైన విద్యను ప్రదర్శించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే సరిగ్గా ఇక్కడే జగన్ తన మార్క్ రాజనీతి ప్రదర్శిస్తున్నారు. అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేశారు.

మాజీలు కాబోతున్న మంత్రులకు కళ్లుచెదిరే ఆఫర్ అందిస్తున్నారు జగన్. ఇప్పుడు మంత్రి పదవి పోగొట్టుకుంటున్న వాళ్లందర్నీ వ్యక్తిగతంగా కలవబోతున్న జగన్... వచ్చే ఎన్నికల్లో గెలవాలని, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే.. తిరిగి మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేయబోతున్నారట. నిజంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇది బంపరాఫర్.

జగన్ మాట ఇస్తే తప్పరనే విషయం లోకం మొత్తానికి తెలుసు. సో.. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవులు పోగొట్టుకున్న వాళ్లంతా 2024లో మళ్లీ గెలవాలనే కసితో పనిచేస్తారు. అలా గెలిస్తే మంత్రి పదవి మళ్లీ గ్యారెంటీ. అలా టీడీపీ నక్కజిత్తులకు జగన్ తన మార్క్ రాజనీతితో చెక్ పెట్టారు.

వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. పార్టీ గెలుపు కోసం అందరూ కృషిచేశారు, అవమానాలెదురైనా, కష్టాలెదురైనా జగన్ కి అండగా నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారు. వారందర్నీ గుర్తు పెట్టుకుని మరీ మంత్రి పదవులిచ్చారు సీఎం జగన్. అయితే ఆ లిస్ట్ లో కొందరికి న్యాయం చేయలేకపోయారు. అలాంటివారందరికీ రెండో విడతలో పదవులివ్వబోతున్నారు.

మరి తొలివిడతలో మూడేళ్లు పదవుల్లో ఉండి అర్థాంతరంగా దిగిపోతున్నవారి పరిస్థితి ఏంటి..? వారు ఏం చేయాలి..? మిగిలినవారికి పదవులివ్వాలంటే పాత వారిని పక్కనపెట్టాల్సిందే. అలాగని వారిని తక్కువ చేస్తున్నట్టు కాదు. కానీ మంత్రిపదవులు పోతున్నవారు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడే పార్టీ నిలబడుతుంది. అందుకే జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ వంటి సున్నిత విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు.

పాతవారికే మళ్లీ పదవులు..

జగన్ ఎ-టీమ్, బి-టీమ్.. ఇలా రెండు టీమ్స్ ని తయారు చేసుకుంటున్నారు. మంత్రివర్గంలో అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేందుకే ఈ రొటేషన్ పద్ధతిని ప్రవేశ పెడుతున్నారు. అవకాశం ఇచ్చే అందరూ తమ సమర్థత నిరూపించుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా అవకాశం ఇవ్వడం అందరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి వారు మాత్రం పార్టీ కోసం కష్టపడినవారిని పక్కనపెడతారు, తన కొడుకుని దొడ్డిదారిన మంత్రిని చేసుకుంటారు. 

జగన్ అలా కాదు, పార్టీకోసం కష్టపడినవారందరికీ పదవులివ్వాలనే ఉద్దేశంతో రెండో విడత కొందరికి మంత్రి పదవులిస్తున్నారు. పాతవారు తిరిగి పార్టీ కోసం కష్టపడి, మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తే.. తొలి విడత పదవులు దక్కేది వారికే. ఆ హామీపైనే ఈ రెండేళ్లు వారు పార్టీ కోసం కష్టపడే అవకాశముంది. 

పదవుల్లో ఉన్నవారు కూడా ఎలాగూ పార్టీ కోసం కష్టపడతారు కాబట్టి.. అందరూ మరోసారి పార్టీ విజయం కోసం అంకిత భావంతో పనిచేస్తారు. నిజంగా జగన్ ఆలోచనకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. 

Show comments