పులివెందుల ప్రజానీకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి మమేకం అవుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ భారతి ప్రచారానికి వెళుతుంటారు. ఈ దఫా కూడా ఆమె పులివెందులలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా తొండూరు మండలం ఇనగలూరులో వైఎస్ భారతి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డి సతీమణి సమతా తదితర కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారతికి గ్రామీణులు ఆప్యాయంగా ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కర్నీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ జగన్ ప్రభుత్వంలో తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఉత్సాహంగా చెప్పారు.
అలాగే స్కూళ్ల రూపు రేఖలు మారాయా? అని జనాన్ని ఆమె ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. అలాగే వివిధ చానళ్లకు ప్రచారం చేస్తూనే ఇంటర్వ్యూలు ఇచ్చారు. జగన్ సంక్షేమ పాలనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు... జనంతోనే ఆమె సమాధానం ఇప్పించడం విశేషం. పులివెందుల, వైఎస్ కుటుంబానికి మధ్య నాలుగు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం వుందని ఆమె చెప్పారు.
పులివెందులకు వైఎస్ కుటుంబం, అలాగే తమ కుటుంబానికి పులివెందుల బలం అని ఆమె చెప్పుకొచ్చారు. పులివెందుల అంటే ఒక ధైర్యం, నమ్మకం, విజయగాథ అని ఇటీవల జగన్ చెప్పడాన్ని భారతి ప్రత్యేకంగా మీడియాకు గుర్తు చేశారు.