పూజా హెగ్దే దశ తిరిగినట్లే

నాగచైతన్యతో 'ఒక లైలా కోసం' సినిమాలో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్దే గుర్తుందా.? అదేనండీ, 'ముకుంద' సినిమాలో వరుణ్‌ తేజ సరసన నటించిన పూజా హెగ్దే ప్రస్తుతం బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ సరసన 'మొహంజదారో' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌కి వెళ్ళినా దక్షిణాది సినిమాల్లో నటిస్తాననీ, తెలుగు సినిమాల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోనని చెప్పింది అప్పట్లో పూజా హెగ్దే. 

ఒక్కసారి బాలీవుడ్‌కి వెళ్ళాక, తిరిగి సౌత్‌ సినిమాలపై ఇంట్రెస్ట్‌ చూపించడమంటే అది చాలా అరుదైన విషయమే. అందునా, సౌత్‌లో సక్సెస్‌ అయిన హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్ళడమంటూ జరిగితే, ఆ తర్వాత సౌత్‌ సినిమాల్లో నటించినా.. ఇక్కడి సినిమాలపై చిన్నచూపు ప్రదర్శించడం చూస్తూనే వున్నాం. శ్రియ, జెనీలియా లాంటోళ్ళు మాత్రం ఇందుకు మినహాయింపుగానే చెప్పుకోవాలి. అసిన్‌, ఇలియానా లాంటోళ్ళయితే టాలీవుడ్‌ని బొత్తిగా మర్చిపోయారు. 

ఇక, పూజా హెగ్దే విషయానికి వస్తే, తెలుగులో వరుస అవకాశాల్ని సొంతం చేసుకోనుందట ఈ బ్యూటీ. అల్లు అర్జున్‌ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే, ఏకంగా పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్‌ కొట్టేసిందనే ఇంకో గాసిప్‌ పూజా హెగ్దే గురించి విన్పిస్తోంది. విన్పించడం కాదు, సౌత్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయనీ, త్వరలోనే 'గుడ్‌ న్యూస్‌' చెబుతానని తాజాగా పూజి హెగ్దే చెప్పడం, ఈ గాసిప్స్‌కి బలం చేకూర్చుతోంది. 

చూద్దాం.. తొలి రెండు సినిమాలతోనూ ఫర్వాలేదన్పించుకున్న పూజా హెగ్దే, ఈసారి మెగా ఆఫర్లు దక్కించుకోవడమే ఖాయమైతే, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

Show comments