పవన్ కి కౌంటరేసిన హోం మంత్రి

పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేశారు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత. ఉత్తరాంధ్రా జిల్లాలలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఆమె వచ్చిన నేపధ్యంలో కోనసీమ ఘటనల మీద మీడియాతో మాట్లాడుతూ విపక్షాల మీద సెటైర్లు వేశారు.

కోనసీమ బాధితులను పవన్ పరామర్శిస్తారుట అని మీడియా అడిగితే ఆయన ముందుగా పరామర్శించాల్సింది మంత్రి, ఎమ్మెల్యేలనే అన్నారు. కోనసీమ ఘటనలో అసలైన బాధితులు వారి కంటే ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు.

మీ రాజకీయాలకు ఇంట్లో ఆడవారు, పిల్లా పాపలు అని కూడా చూడరా. ఏకంగా ఇంటికే నిప్పు పెడతారా అని అరాచక శక్తుల మీద వాటిని ప్రేరేపించిన వారి మీద కూడా హోం మంత్రి ఫైర్ అయ్యారు. కోనసీమ ఘటనల వెనక దోషులు ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేసారు.

ఒకటి రెండురోజులలో అన్ని విషయాలూ వెలుగు చూస్తాయని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా మహానాడు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ఆమె ప్రశ్నించారు. అలాంటి ఆలోచనలు కూడా ప్రభుత్వానికి అసలు ఉండవ‌ని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి హోం మంత్రి ధాటీగానే విపక్షాలకు బదులు ఇవ్వడం విశేషం.

Show comments