కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులందరికీ అధికారం పోయిందన్న బాధ విపరీతంగా ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బహిరంగంగానే తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అర్జంటుగా పీకేసీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే కూల్చేసి తాము అధికారంలోకి వచ్చేయాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు 12 సీట్లిస్తే ఏడాదిలోగా అధికారం తన సొంతమవుతుందని కేసీఆర్ చెబుతున్నాడు. 12 సీట్లిస్తే కేసీఆర్ మళ్లీ రాష్ట్రాన్ని శాసిస్తాడని కేటీఆర్ ఊదరగొడుతున్నాడు. హామీలు అమలు చేసే విషయంలో హరీష్రావు రేవంత్కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నాడు. రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని పదే పదే చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్చీ ఎక్కినప్పటినుంచి రేవంత్ రెడ్డిని కేసీఆర్, అయన కుటుంబ సభ్యులు, గులాబీ పార్టీ నాయకులు గుక్క తిప్పుకోనివ్వడంలేదు. ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు. తక్షణం ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, లేకపోతే నీకు పాలన చేతకాదని అంటున్నారు.
కేసీఆర్ చేసిన అప్పులు బొచ్చెడు ఉన్నాయని సీఎం, మంత్రులు చెబుతుంటే కేటీఆర్, హరీష్రావు మొదలైనవారు రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెసుకు అప్పగించామని అంటున్నారు. సరే... ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసింది. దీన్ని కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేసింది. దాన్నే తెలంగాణలో అమలు చేశారు. ఏపీలో టీడీపీ– బీజేపీ– జనసేన కూటమి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది.
రాష్ట్రంలో ఓన్లీ ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టారు. అంటే దీని వల్ల రూరల్ ఏరియాల్లో ఉండే మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం ప్రవేశపెట్టగానే బీఆర్ఎస్పార్టీ నేరుగా వ్యతిరేకించకుండా ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రచారం మొదలు పెట్టింది.
కేసీఆర్ మీడియాలో అదే పనిగా వార్తలు గుప్పించారు. ఇది మహిళలకు ఉచిత ప్రయాణం కాబట్టి నేరుగా వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ వాళ్లు మహిళలకు కంటవుతారు. కేటీఆర్, హరీష్రావు కూడా ‘ఈ పథకం మంచిదే కాని’ అంటూనే ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ వారి అవస్థలు ఏకరువు పెట్టారు. వాళ్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
మహిళలు మాత్రం ఉచిత ప్రయాణంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనివల్ల ఆర్టీసీకి నష్టాలు ఏమీ రావని అంటూ కొందరు నిపుణలు ఏవో లెక్కలు చెప్పారు. కాకపోతే కొందరు మహిళలు పనీపాటా లేకుండా బస్సుల్లో పడి తిరుగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. బస్సులు సరిపోవడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో వాటి సంఖ్య పెంచడానికి కొత్త బస్సులు కొనాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ... మొదటిసారిగా కేసీఆర్ మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈసడించుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘ఇదో పనికిమాలిన పని’ అని ఎద్దేవా చేశాడు. కొడుకు, మేనల్లుడు ఈ పథకాన్ని విమర్శించడానికి భయపడితే కేసీఆర్ మాత్రం తీసిపారేశాడు. మరి ఆయన కామెంట్స్ ఎఫెక్ట్ ఎన్నికల మీద ఉంటుందా?