దాడి కుటుంబం జనసేనలోకి ...?

విశాఖ జిల్లా అనకాపల్లిలో రాజకీయ ప్రముఖుడిగా మాజీ మంత్రిగా ఉన్న దాడి వీరభద్రరావు జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం అయితే సాగుతోంది. 

వైసీపీలో ఉంటే ఈసారి కూడా తన కుమారుడు దాడి రత్నాకర్‌కు టిక్కెట్‌ దక్కే సూచనలు కనిపించకపోవడంతో ఆయన ఏడు పదుల వయసులో మరోమాపు పార్టీ ఫిరాయించడానికే నిర్ణయించుకున్నారని అంటున్నారు. 

పెద్ద మనిషిగా రాజకీయ మేధావిగా పేరు పొందిన దాడి గడచిన పదేళ్లలో నాలుగు పార్టీలు మారడం వల్లనే అటు తెలుగుదేశానికి ఇటు వైసీపీకి చెడ్డారని కూడా అంటున్నారు. ఇక జనసేనలోకి వెళ్తే ఆయనకు టిక్కెట్‌ హామీ లభిస్తుందా అన్నది కూడా చూడాలి. 2018లో తన నివాసానికి స్వయంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించినా దాడి ఆనాడు ముఖం చాటేశారు. 

ఇపుడు ఏ అవకాశం లేక జనసేనలోకి వస్తానంటే పవన్‌ ఆహ్వానించినా టిక్కెట్‌ విషయంలో మాత్రం కచ్చితంగా అయితే హామీ ఇవ్వలేరనే అంటున్నారు. ఇక చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చాలానే చేసిన దాడికి పొత్తులలో భాగంగా టిక్కెట్‌ జనసేన నుంచి అయినా ఇచ్చేందుకు బాబు ఇష్టపడతారా అన్నది మరో చర్చ.  

అయితే దాడి మాత్రం తన ప్రయత్నాలలో తాను ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనకాపల్లి రాజకీయాలలో పాతతరానికి చెందిన దాడి ప్రభావం ఈ రోజున అయితే పెద్దగా లేదన్నది నిజం. అందువల్లనే ఏ పార్టీ అయినా టిక్కెట్‌ విషయంలో ఆలోచించకతప్పదనే అంటున్నారు.

Show comments