ఎన్నికల బరిలో ఉనికి చాటుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడంలో అనాకపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చేస్తూ ఉన్నారు కానీ, గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. బీజేపీ తరఫున పోటీ చేసిన చంద్రబాబు నాయుడి సన్నిహితుల్లో ఒకరిగా సీఎం రమేష్ ఉన్నారు. అయితే రాయలసీమలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉంటే.. అంతో ఇంతో అర్థవంతంగా ఉండేదేమో కానీ, ఎక్కడో అనాకపల్లికి పోయి పోటీ చేయడమే ఈయన పాలిట పెద్ద శాపంగా మారింది!
అనకాపల్లి బరిలో తను ఉన్నాను అనిపించుకోవడానికి సీఎం రమేష్ సకల ఎత్తుగడలూ వేశారు. చిరంజీవితో బైట్ ఇప్పించుకున్నాడు, దాని కోసం ఎప్పటి నుంచినో లాబీయింగ్ చేశాడట! ఇలాంటి పరిస్థితులు వస్తాయని, చిరంజీవిని వాడుకోవడానికి అనుగుణంగా ఢిల్లీ నుంచి గతంలోనే ఈయన లాబీయింగ్ చేశాడని ఆయన మాటలను బట్టే స్పష్టం అవుతోంది. ఇక ఈ టికెట్ తనకే దక్కేలా చేసుకోవడంలో కానీ, ఇక్కడ నుంచి పోటీ చేస్తాడన్న నాగబాబును సైడ్ చేయడంలో కానీ.. సీఎం రమేష్ గట్టిగానే వర్కవుట్ చేశారు!
అయితే స్థానికత ఈయనకు పెద్ద సెట్ బ్యాక్ గా మారింది. ఇక అనకాపల్లిలో ఈయన ఖర్చులు భారీగానే నమోదవుతున్నాయని వినికిడి! తను పోటీలో ఉన్నానని చాటుకోవడానికి ఈయన గట్టిగానే పని చేస్తూ ఉన్నాడు. స్థానికంగా ఎవరిని ఎలా కొట్టాలో వారిని అలా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఏం చేసినా.. ఈ వెలమ నేతకు అనకాపల్లిలో అవకాశం లేదని గ్రౌండ్ రిపోర్ట్ చెబుతూ ఉంది!
స్థానికంగా గణనీయంగా ఉన్న కొప్పుల వెలమలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా నిలుస్తూ ఉన్నారు. స్థానికేతరుడు అయిన సీఎం రమేష్ పట్ల స్థానికుల్లో ఎలాంటి సానుకూలతా వ్యక్తం కావడం లేదు! ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎం రమేష్- బీజేపీ గుర్తు పుణ్యాన ఈ లోక్ సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆ ప్రభావం గట్టిగా పడే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక పార్టీకి, లోక్ సభ అభ్యర్థికి ఒక పార్టీ అభ్యర్థికి ఓటేసే సంప్రదాయాలు తెలుగునాట అతి తక్కువ! ఇలాంటి నేపథ్యంలో సీఎం రమేష్ వల్ల అనకాపల్లి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఎదురుగాలి వీస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు!