చంద్రబాబు ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జరుగుతున్న లొల్లిని గమనించారా? స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ లొల్లిని ముందుకు తీసుకు వెళ్లడానికి విశ్వయత్నం చేస్తున్నారు. అది గమనించేవారంతా విస్తుపోవలసి వస్తోంది. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. ప్రధానంగా నా ఓటు నాకు పడిందా? ఎవరికి పడిందో.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అందరిని విభ్రాంతికి గురిచేసింది. చంద్రబాబుకు ఏమైంది అన్న ప్రశ్నను తెలుగుదేశంవారు సైతం వేసుకుంటున్నారు.

చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసివెళ్లి ఓటువేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి తాము గెలుస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా తాను వేసిన ఓటు టీడీపీకి పడిందో, లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. అంటే దానర్ధం చంద్రబాబు వీవీపాట్‌లో తను వేసిన పార్టీ గుర్తు చూసుకునే బయటకు వచ్చారనే కదా.. అప్పుడు ఆయనకు సందేహం రాలేదనే కదా.. మరి ఆ కాసేపటికి ఏమైందో.. కాని చంద్రబాబు వెంటనే ఒక పెద్ద వ్యూహాన్నే అమలుచేయడం ఆరంభించారు. ప్రతి ఎన్నికలోను కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుంటాయి. వాటిని సాంకేతిక సిబ్బంది వెళ్లి సరిచేస్తుంటారు.

కాని చంద్రబాబు మాత్రం దానిని ప్రపంచ సమస్యగా మార్చాలని చూశారు. ఏకంగా ముప్పైశాతం ఈవీఎంలు పనిచేయడం లేదని, సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే ప్యాన్‌కు పడుతోందని కొందరు చెబుతున్నారని అంటూ కొత్త పుకార్లను లేవదీసే యత్నంచేశారు. ఆయన ఏకంగా ఈ విషయాలపై  ఎన్నికల ముఖ్య అధికారికి లేఖ కూడా పంపించారు. ఇందులో విషయం అర్థం అవుతూనే ఉంది. పెద్దఎత్తున తరలివస్తున్న ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతోందని ఇంటెలిజెన్స్‌ ఉప్పు అందించి ఉండాలి. అందుకే ఓటర్లను తప్పుదారి పట్టించే లక్ష్యంతో ఆయన ఏకంగా ముప్పైశాతం ఈవీఎంలు పనిచేయడం లేదని, ఓటర్లు అంతా వెళ్లిపోతున్నారని టీడీపీ ద్వారా ప్రచారం పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే తెలివిగా ఓటు వేయడానికి రావాలని పిలుపు ఇచ్చినట్లు లీక్‌ ఇచ్చుకున్నారు.

ఇవన్నీ ఎన్నికల వ్యూహంలో భాగమేనని అర్థం చేసుకునేవారికి తెలియకపోదు. కాకపోతే చంద్రబాబు ఇంకా పాత పద్ధతిలో దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని యోచిస్తున్నారు. అందువల్లే ప్రజలు ఎవరూ ఈయన లేఖను పట్టించుకోలేదు. ఈయన పిలుపుకోసం ఎదురు చూడలేదు. ఎనభైశాతం మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత ఫోలింగ్‌ బూత్‌ల వద్ద సదుపాయాలు లేవని, మరొకటని, మరొకటని ప్రచారం చేశారు. వాటన్నిటికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా.. ఒక స్కూల్‌ బాగోపోతే ఎన్నికల కమీషన్‌ ఏమిచేస్తుంది? స్కూల్‌లో మంచినీళ్లు లేవంటే సిగ్గుపడవలసింది రాష్ట్ర ప్రభుత్వమా? లేక ఎన్నికల కమీషనా? ఎన్నికల కమీషన్‌కు ఏమైనా ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారా?

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిబ్బందినే కదా వారు వాడుకునేది. వాళ్లను ముందుగా నియమించింది, జాబితాను పంపించింది రాష్ట్రమే కదా.. అందుకే కదా.. అంగన్‌ వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇలా నైపుణ్యం లేని వారిని, నారాయణ, చైతన్య విద్యాసంస్థల వారిని పెట్టుకున్నది.. వీళ్లలో చాలామందికి ఈవీఎమ్‌లకు, వీవీపాట్‌లకు కనెక్షన్‌ ఇవ్వడంరాక ఇబ్బందిపడి ఫోలింగ్‌ ఆలస్యం అయితే అదేదో  ఎన్నికల సంఘం విఫలం అయినట్లు ప్రచారం చేయడం ఏమిటి? ఎక్కడ ఎన్నికల సంఘంతో చంద్రబాబుకు ఇబ్బంది వచ్చింది అంటే.. తనకు అనుకూలంగా జిల్లాలలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న ఇద్దరు, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయడాన్ని, తన కుమారుడు లోకేష్‌ పోటీచేసిన మంగళగిరిలో ఇద్దరు సీఐలను కమీషన్‌ బదిలీ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.

ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ సరేసరి.. 2009లో ఇదే చంద్రబాబు కదా.. మొత్తం ముఖ్యమంత్రితో సహా అటెండర్‌ వరకు అంతా ఎన్నికల కమీషన్‌ పరిధిలోకి వస్తారని చెప్పింది. అప్పటి డీజీపీ యాదవ్‌ను బదిలీ చేయాలని కోరడం, కమీషన్‌ ఆ విధంగా మార్చడం జరిగింది కదా.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి లొల్లి చేయలేదు కదా.. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ఇంత గొడవ చేస్తున్నారు.. దానికి కారణం స్పష్టంగానే కనిపిస్తోంది. రాయలసీమ మొదలు ప్రకాశంజిల్లా వరకు గతసారే వెఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మెజార్టీ సీట్లు వచ్చాయి. మిగిలిన జిల్లాలలో ఆ పార్టీ ఈసారి ఇంకా పుంజుకుంది. దానికితోడు టీడీపీకి ఆయువుపట్టుగా గతసారి పనిచేసిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం కాని, ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల కాని టీడీపీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

ఎనిమిది జిల్లాలలో టీడీపీకి మైనస్‌ అయిన తర్వాత మిగిలిన ఐదు జిల్లాలలో మొత్తం సీట్లు గెలుచుకునే పరిస్థితి ఎటూలేదు. దాంతో ఓటమి అంచున ఉన్నామన్న భయంతోనే చంద్రబాబు మొత్తం నెపం అంతా ఈవీఎంలపై నెడుతున్నట్లుగా ఉంది. అదే విషయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ప్రశ్నించారు. తెలుగుదేశం సభ్యులు కాని, ఫోలింగ్‌ ఏజెంట్లు కాని చంద్రబాబు చెబుతున్నట్లు ఈవీఎంలు పనిచేయకపోతే ప్రశ్నించకుండా ఉంటారా? వారెవ్వరికి రాని సందేహం చంద్రబాబు ఒక్కరికే ఎందుకు వచ్చింది.. ప్రజలను అయోమయానికి గురిచేయడం కోసమే చంద్రబాబు ఈ వ్యూహాలు అమలు చేశారు.

గతంలో 2014లో ఇవే ఈవీఎంలతో చంద్రబాబు గెలిచారు కదా.. నంద్యాల ఉప ఎన్నికలో ఈవీఎంలపై ఎలాంటి ఆరోపణ చేయలేదు కదా.. ఇప్పుడే ఎందుకు చంద్రబాబు ఇలా లొల్లి చేస్తున్నారన్న సామాన్యుడి ప్రశ్నకు జవాబు చెప్పకుండా చంద్రబాబు, ప్రజాస్వామ్యం అని గొంతు చించుకుంటూ తిరిగేస్తున్నారు. ఎక్కడైనా ఎన్నికల కమీషన్‌ వైపు కొన్నిలోపాలు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిచేయాలని చెప్పడం తప్పుకాదు. కాని ముప్పైశాతం ఈవీఎంలు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పారంటే ఏమి అనుకోవాలి. అంటే సుమారు ఇరవైవేల ఈవీఎంలు పనిచేయడం లేదని ఆయనే వదంతి సృష్టించారు. తీరాచూస్తే అన్నీకలిపి నాలుగు వందల లోపే.. గతసారి ఇలా పనిచేయనివి ఐదు వందలపైనే ఉన్నాయట. తనకు మీడియా అండ ఉందని చంద్రబాబు చెలరేగిపోయారంటే ఆశ్చర్యం కాదు.

అదే సమయంలో మళ్లీ తామే గెలుస్తామని చెబుతున్నారు. పైగా 150సీట్లు వస్తాయని అంటారు. ఈవీఎంలలో మోసాలు జరిగితే అది ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేస్తే ఈయన ఎలా గెలుస్తారన్నదానికి సమాధానం దొరకదు. అన్ని అంశాలలోను రెండునాల్కల ధోరణి మాదిరే ఇక్కడ కూడా చంద్రబాబు డబుల్‌ టాక్‌ సాగించారు. టీడీపీ కార్యకర్తలు డీమొరలైజ్‌ అవ్వకుండా గెలుస్తామని చెప్పడం, ఓడిపోతే ఎన్నికల సంఘంపైన ఆరోపణలు చేయడం.. ఈ రెండిటిలో ఏది కావాలంటే దానిని వాడుకోవడానికి వీలుగా ఆయన మాట్లాడుతున్నారు. దానివల్ల చంద్రబాబు విశ్వసనీయత మరింతగా దెబ్బతింటోంది. డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు హుందాగా ఉండి, మంచి పేరు తెచ్చుకుంటే అంతా సంతోషిస్తారు.

ఐదేళ్ల ఏకపక్ష పాలన సాగించిన విధంగానే ఎన్నికల తర్వాత కూడా ఆయన కొనసాగిస్తున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం కలుగుతుంది. ఎన్నికల సంఘం నియమించిన చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఉద్దేశించి కోవర్టు అని, కేసులు ఉన్నాయని ఆరోపించడం సీఎంకు తగునా? మరి అలాంటి వ్యక్తికి తన ప్రభుత్వంలోనే ప్రమోషన్‌ ఇచ్చారు కదా.. తను ఎంపిక చేసుకున్న చీప్‌ సెక్రటరీ పునేఠాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల సంఘంపై కేసు వేయించడం ద్వారా ఆయన పరువు తీశారు. చివరికి ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించింది.

మరోవైపు టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా డబ్బు పంపిణీ చేయకుండా ఐటీశాఖ, ఎన్నికల పర్యవేక్షకులు నిఘాపెట్టడం కూడా చంద్రబాబుకు చికాకు తెప్పించింది. అందుకే ఆ విషయాలను ఆయన దాచుకోలేకపోతున్నారు. బీజేపీకి దూరం అయిన తర్వాత కొంతకాలం భయపడిన ఆయన ఎన్నికల సమయంలో హద్దులు దాటి ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా దూషించారు. ఎన్నికలలో ఓడిపోతే ఏమవుతుందోనన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది.

టీడీపీ ఓడిపోవచ్చు.. గెలవవచ్చు.. కాని విలువలు లేకుండా వ్యవహరించడం ఎప్పటికే అప్రతిష్టే. వెరసి ఇవన్నీ కలిసి చంద్రబాబు ఈవీఎంలని, మరొకటని లొల్లి, లొల్లి చేసి కాస్తో కూస్తో మిగిలిన పరువును కూడా పోగొట్టుకున్నట్లయిందని చెప్పాలి. ఇది దురదృష్టం.
-కొమ్మినేని శ్రీనివాసరావు

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

Show comments