జయం రవి, అరవింద్ స్వామి.. కాంబోపై టాలీవుడ్ కన్ను!

హిట్టైన కాంబినేషన్ ను రిపీట్ చేయడం ఎక్కడైనా మామూలే. అది కూడా సంచలన విజయం సాధించిన సినిమా విషయంలో అయితే.. ఆ కాంబినేషన్ రిపీట్ కావడం చాలా మందిలో ఆసక్తిని రేపుతుంది. వారి కాంబోలో వచ్చిన తొలి సినిమా హిట్టైన తీరు రెండో సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పుడు జయం రవి, అరవింద్ స్వామిల విషయంలో కూడా అదే జరుగుతోంది. 

కొంత విరామం తర్వాత తన రెండో ఇన్నింగ్స్ లో ‘తనీ ఒరువన్’ లో విలన్ గా నటించాడు అరవింద్ స్వామి. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టై.. ఇప్పుడు తెలుగు లో రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతోంది. హిందీలో కూడా ఈ తమిళ సినిమా రీమేక్ ప్రతిపాదన ఉంది. ఈ సంగతిలా ఉంటే.. తమిళంలో ఇప్పుడు రవి, అరవింద్ స్వామి కాంబినేషన్ లో ఒక సినిమా సౌత్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

‘బోగన్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ‘తనీ ఒరువన్’ తర్వాత వీరి కాంబినేషన్ రిపీటవుతోంది. ఈ సినిమాను ప్రభుదేవా నిర్మిస్తున్నాడు. దీంతో.. టాలీవుడ్ కన్ను ఈ సినిమాపై పడింది. దీని డబ్బింగ్ పై చాలా మంది నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తనీ ఒరువన్ కాంబినేషన్ రిపీట్ పై తమిళంలో భారీ గా అంచనాలు ఉన్నట్టుగానే. .దీన్ని తెలుగులోకి డబ్ చేయడంపై కూడా అంతే ఆసక్తి వ్యక్తం అవుతోంది కొంతమంది నిర్మాతల నుంచి. 

ఈ నేపథ్యంలో దీని డబ్బింగ్ రైట్స్ విషయంలో ప్రభుదేవాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫ్యాన్సీ ధర చెల్లించి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నాడు. రవి, అరవింద్ కాంబోలోని ఈ రెండో సినిమాను తెలుగులో విడుదల చేస్తే వర్కవుట్ అవుతుందనేది ఈయన లెక్క. ‘తనీ ఒరువన్’ ను చరణ్ రీమేక్ చేస్తుండం కూడా ఈ సినిమా తెలుగు రైట్స్ విషయంలో  ఇంత ఆసక్తి ఉండటానికి ఒక రీజన్ అని వేరే చెప్పనక్కర్లేదు.  

Show comments