బాబుకు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇవ్వాలి!

పోల‌వ‌రంపై ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబునాయుడు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసి, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఎప్ప‌ట్లాగే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డం వ‌ల్లే పోల‌వ‌రం నిర్మాణం ఆగిపోయింద‌ని, ఇప్పుడు దాని భ‌విష్య‌త్ ఏంటో చెప్ప‌లేని ప‌రిస్థితిలో వుందంటూ చంద్ర‌బాబు త‌న మార్క్ విమ‌ర్శ‌లు చేశారు. పోల‌వరానికి సంబంధించి క్రెడిట్ ఏదైనా వుందంటే తాను తీసుకుని, త‌ప్పుల్ని మాత్రం వైఎస్సార్‌, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ పాల‌న‌ల‌పై వేయ‌డం చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌లోని ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు.

చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ త‌ర్వాత‌, జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. పోల‌వ‌రం నిర్మాణం ప్ర‌శ్నార్థ‌కం కావ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని ఎప్ప‌ట్లాగే ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త‌ల్ని తాను తీసుకుని అతిపెద్ద త‌ప్పు చేశార‌ని బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బాబు శ్వేత ప‌త్రం విడుద‌ల సంద‌ర్భంగా ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

అయితే చంద్ర‌బాబుకు పోల‌వ‌రంపై అంబ‌టి రాంబాబు బ‌దులు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబును ఎండ‌గ‌ట్టేందుకు జ‌గ‌న్‌కు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని చాలా మంది అంటున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం క‌నీసం ఈ ద‌శ‌లో అయినా వుందంటే దానికి కార‌ణం దివంగ‌త వైఎస్సార్ మాత్ర‌మే అని అంద‌రికీ తెలిసిన స‌త్యం. దీన్ని జ‌గ‌న్ స‌ద్వినియోగం చేసుకోడానికైనా జ‌గ‌న్ మీడియా ముందుకు రావాల్సిన అవ‌స‌రం వుంద‌నే వాళ్లే ఎక్కువ‌.

పోల‌వ‌రం నిర్మాణంలో చంద్ర‌బాబు చెప్పిందేంటి?  అందులో నిజానిజాల గురించి జ‌గ‌న్ పౌర స‌మాజానికి వివ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. బాబుకు కౌంట‌ర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు రావాల‌ని ఇప్ప‌టికే కొంద‌రు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. పోల‌వ‌రంపై జ‌గ‌న్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తే బాగుంటుంద‌ని వైసీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. బాబుకు అంబ‌టి రాంబాబు కౌంట‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ, త‌గినంత‌గా ఆక‌ట్టుకోద‌ని సాగునీటి నిపుణులు  అంటున్నారు.  Readmore!

Show comments