రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత మద్దతు పెంచేలా ప్రత్యర్థుల కామెంట్స్ ఉన్నాయి. జగన్పై ద్వేషంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాన్ని కించపరిచేలా ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కూటమి పాలిట శాపమవుతోంది. మరోవైపు జగన్ తాను పులివెందుల, కడప, రాయలసీమ బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడుతున్నానని రెండు రోజుల క్రితం స్పష్టం చేశారు.
పులివెందుల కల్చర్ అంటే ఒక నమ్మకం, ధైర్యం, పోరాడే తత్వం, సక్సెస్ ఫుల్ విజయగాథ అంటూ గర్వంగా చెప్పారు. ప్రత్యర్థులు తనను కించపరచడానికి రాష్ట్రమంతా పులివెందుల, కడప, రాయలసీమ కల్చర్ అంటూ విమర్శలు చేస్తుంటారంటూ, వాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనది కడప, రాయలసీమ బ్రాండ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రాయలసీమ వాసులు ఫిదా అయ్యారు. తమ వాడు జగన్ అని మెజార్టీ సీమ ప్రజానీకం చెప్పుకోడానికి సంతోషించే పరిస్థితి.
మరోవైపు జగన్ను కించపరచడానికి మరోసారి ఆ ప్రాంతంపై జనసేన నాయకుడు విషం చిమ్మడం విమర్శలకు దారి తీసింది. నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ రాయలసీమ వాసులకు కోపం తెప్పిస్తోంది.
"కడప నుంచి రౌడీలను పంపించారు. పవన్కల్యాణ్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎంపీ మిథున్రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా లాంటి కొందరి పాత్ర ఇందులో వుంది. దీనిపై మాకు సమాచారం వుంది" అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపణలు చేశారు. ఇలాంటి కామెంట్స్ జనసేన, టీడీపీ నేతలకు సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ ఒక ప్రాంతం వాసులను రౌడీలుగా చిత్రీకరిస్తూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నామనే స్పృహ నాగబాబుతో ఎందుకు కొరవడిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇలా జగన్పై అక్కసుతో రాయలసీమ సమాజంపై సాంస్కృతిక దాడి చేస్తుండడం వల్ల... రాజకీయంగా ఆ ప్రాంతవాసులందరినీ వైసీపీకి అనుకూలంగా ప్రత్యర్థులే మారుస్తున్నారని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ప్రత్యర్థులు గ్రహించకుండా, నిత్యం ఆడిపోసుకుంటూ సీమను వైసీపీ అడ్డాగా మారుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్కు ప్రత్యర్థులు రాజకీయంగా చేస్తున్న మేలు అంతాఇంతా కాదు.