జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ రాజకీయ డ్రామా ఆడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోతిన మహేశ్ బిల్డప్ బాబాయ్ అంటూ ఆయన వెన్నంటి నడిచే వాళ్లే విమర్శిస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీటును పోతిన మహేశ్ ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. తనకే విజయవాడ వెస్ట్ ఇవ్వాలంటూ పోతిన తన అనుచరులతో కలిసి రోజుల తరబడి పోరాటాలు చేశారు.
నిజాయతీగానే పోతిన టికెట్ కోసం ఆరాటపుడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన పోరాటానికి అనుచరులు మద్దతు పలికారు. అయితే బీజేపీకి కేటాయించిన తర్వాత పోతిన మహేశ్ నోరెత్తిన పాపాన పోలేదు. ఇదేంటి, అంతన్నాడు, ఇంతన్నాడు... చివరికి ఏమీ మాట్లాడలేదని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
నిజంగా పోతిన మహేశ్కు తన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఆశయమే వుంటే, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని, ఆయన్ను గెలిపించుకుంటామని వారు అంటున్నారు. పోతిన మహేశ్ ఆందోళనలపై మరో ప్రచారం కూడా విజయవాడలో జరుగుతోంది. ఇన్నేళ్లుగా జనసేన బలోపేతం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ లేకపోవడంతో అప్పులోళ్లు వచ్చి చుట్టుమడుతారని పోతిన మహేశ్ సన్నిహితుల వద్ద అంటున్నారని తెలిసింది. కావున బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి నుంచి డబ్బు రాబట్టుకోడానికే పోతిన మహేశ్ నానాయాగీ చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు.
తాజా పరిణామాలు చూస్తుంటే, అదే నిజమని నమ్మేవాళ్లు ఎక్కువే. ఇవాళ పోతిన మహేశ్ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. నిజంగా పోతిన మహేశ్కు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి వుంటే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇవాళ పోతిన మహేశ్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోననే ఉత్కంఠ నెలకుంది. పవన్కల్యాణ్ చెప్పారని పోటీ నుంచి తప్పుకుని, బీజేపీకి మద్దతు ఇస్తానని మహేశ్ అంటే మాత్రం, ఇక ఆయన్ను జనసేన కార్యకర్తలు విడిచి పెట్టడం మంచిది. ఎందుకంటే, ఆయన ఏడుపంతా దబ్బు కోసమే అనే ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మే అవకాశం వుంది.