అన్నదాత మూసివేతను ఎలా చూడాలి

తెలుగు నాట మాత్రమే కాదు…దేశంలోనే మీడియా మొఘల్ గా పేరు తెచ్చుకున్న రామోజీరావు తొలి ప్రింట్ వెంచర్ ‘అన్నదాత’ దాని తరువాతే మిగిలినవన్నీ. ఇప్పుడు మారుతున్న కాలానికి తలవంచి అన్నదాత ప్రచురణను ఆపేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి రామోజీ ఫెయిల్యూర్ గా ఎంత మాత్రం కాదు. మారుతున్న వ్యవసాయం తీరుతెన్నులుగా చూడాల్సిందే. అసలు అంతకు ముందు అన్నదాత విషయంలో రెండు సంగతులు చూడాలి.

అన్నదాత ప్రచురణ ఆర్థికంగా లాభమా? నష్టమా? అన్నది. అందులో ఒకటి. నష్టం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే అన్నదాత ఎప్పడూ కౌంటర్ సేల్స్ మీద నడిచిన మాగ్ జైన్ ఎంతమాత్రం కాదు. ఏడాదికి ముందే ఏడాది చందా వసూలు చేసేసేవారు. ఆ మేరకే ప్రింట్ ఆర్డర్ వుండేది. ఏడాది చందా చెల్లించడం కోసం అట్రాక్షన్ గా ఓ డైరీ ఫ్రీగా అందించేవారు. అందువల్ల చందాదారులకు హ్యాపీ. ముందుగానే చందాలు వచ్చేసేవి కనుక రామోజీ హ్యపీ. ఇక ఆర్థికంగా నష్టం..లాభం అన్న ప్రశ్న లేదు.

మరి ఎందుకు మూసేస్తున్నట్లు?

ఇదే అసలైన ప్రశ్న. దీనికి సమాధానం కావాలి అంటే అసలు అన్నదాత చందాదారులు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం కావాలి.

దక్షిణ కోస్తాలో మోతుబరి రైతులు,భూస్వామలు,అలాగే తూర్పు, పశ్చిమ జిల్లాల్లో మంచి స్తోమత వున్న రైతులు, ఉత్తరాంధ్రలో కొద్ది మంది వ్యవసాయం చేసే భూస్వాములు మాత్రమే చందాదారులు. అంతే తప్ప కౌలు రైతులు, చిన్న రైతులు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే చిన్న రైతులు అంతగా చదువుకున్న వారు కాదు.పైగా చందా కట్టేంత ఆసక్తి వున్న వారు కాదు.

మరి ఇప్పుడు ఏమయింది. రాను రాను దక్షిణ కోస్తా, తూర్పు, పశ్చిమ జిల్లాల భూస్వాములు వున్నారు. కానీ వారు వ్యవసాయం చేయడం తగ్గిపోతోంది. భూస్వాముల తరం రాను రాను తగ్గిపోతోంది. వారి పిల్లలు అంతా సాఫ్ట్ వేర్ లేదా ఇతర వ్యాపారాల వైపు మరిపోయారు. చాలా వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ గా మారుతున్నాయి. లేదా కౌలుకు వెళ్తున్నాయి. అందువల్ల అన్నదాతను ఆదరించిన తరం అంతరించిపోతోంది. యువతరానికి వ్యవసాయం మీద అంతగా ఆసక్తి లేదు. వున్నా దానికి డిజిటల్ మార్గాలు అనేకం వున్నాయి నేర్చుకోవడానికి.

అదే అన్నదాతకు అసలు సమస్య. వ్యవసాయం భారీగా చేసే వారు తగ్గిపోతున్నారు. కౌలు,చిన్న సన్న కారు రైతులు మిగులుతున్నారు. వ్యవసాయ భూములు తగ్గుతున్నాయి. ఇక అన్నదాతను ఆదరించేవారు ఎవరు?

అందుకే అన్నదాత ఆగిపోయినందుకు కాదు..వ్యవసాయం దారి తప్పేస్తున్నందుకు బాధపడాల్సిందే.

విఎస్ఎన్ మూర్తి

Show comments