నాగార్జున…..మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ.. నితిన్, ఇలా చాలా మందికి గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు దర్శకుడు కృష్ణ వంశీ. కానీ గమ్మత్తేమిటంటే వీళ్లెవ్వరూ రంగమార్తాండ సినిమా చూడలేదు. వీళ్లకు చూపించలేదు. కెేవలం దర్శకులకు, సినిమా జనాలకు, మీడియాకు మాత్రమే వరుసపెట్టి షో లు వేస్తూ వచ్చారు.
ఇండస్ట్రీ జనాలు చాలా మంది ఎవరైతే శుక్రవారం సినిమా చూస్తారు అనుకుంటారో వాళ్లంతా ముందే ఈ ఫ్రీ షో లు చూసేసారు. ఎవరికి వారు వారి వారి సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి పాజిటివ్ గా తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు.
కానీ గమ్మత్తేమింటే ఎక్కువగా ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగిన వారు అయిన హీరోలు మాత్రం రంగ మార్తాండ వైపు తొంగి చూడలేదు. ఆ అవకాశం కూడా కృష్ణ వంశీ ఇవ్వలేదు. ఒక్క మెగాస్టార్ మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు సహకరించారు. ఎందుకిలా జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. కృష్ణ వంశీ కావాలని ఆత్మాభిమానంతో హీరోల దగ్గరకు వెళ్లి తన సినిమా చూడమని అడగలేదా? లేకా వారు చూడరని ముందుగానే భావించి అడగలేదా?
ఇంత మంది తోడు అందించిన దానికి తోడుగా హీరోలు కూడా ఓ మాట సాయం చేసినట్లయితే సినిమాకు మరింత బలమైన కలెక్షన్లు వచ్చి వుండేవి. కానీ ఇప్పుడు సినిమాకు మంచి పేరు అయితే వచ్చింది కానీ కలెక్షన్లు రావడం లేదు. ఉగాది నాడు ఓ మాదిరి అనుకుంటే మర్నాడు గురువారం సినిమా అస్సలు కలెక్షన్లు లేక వెలవెల పోయింది హైదరాబాద్ సిటీలోని మెయిన్ థియేటర్ మాత్రం కాస్త ఫరవాలేదు అనిపించుకుంది.
ఇదే కనుక కృష్ణ వంశీ హీరోల కోసం ప్రత్యేకంగా షో వేసి, వారి మద్దతు తీసుకుని వుంటే మరింత దన్నుగా వుండి వుండేది. ఈవారాంతం లోని శని, ఆదివారాలే ఇప్పుడు మిగిలిన హోప్. ఆ తరువాత ఇక దసరా హోరు మొదలైపోతుంది.