ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఒకటికి ఐదారు సంస్థలతో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్వేలు చేయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకునేందుకు జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారు.
పలు సర్వేల ఫలితాలను బట్టి ప్రస్తుతానికి 14 నియోజకవర్గాల్లో అత్యంత బలహీనంగా పార్టీ పరిస్థితి వున్నట్టు జగన్ ఓ అంచనాకు వచ్చారు. దీంతో ఆ నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు.
టికెట్లు రావని భావించే వాళ్లు, పక్క పార్టీ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలు, అలాగే టికెట్లు రాకున్నా, వైసీపీలోనే వుంటూ నష్టపరిచాలనే ఆలోచనలో ఎవరెవరు ఉంటారో జగన్ ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో అలాంటి చోట పార్టీకి నష్టం జరగకుండా ఏం చేయాలనే అంశంపై ముఖ్య నేతలతో ఆయన సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ దఫా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేనట్టు తెలిసింది. అలాంటి వాళ్లలో కొందరు ఇప్పటికే బయటపడగా, మరికొందరు సన్నిహితుల వద్ద జగన్పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలిసింది.
ఇలాంటి వాళ్ల గురించి జగన్ దగ్గర జాబితా వుంది. అందుకే పదేపదే పద్ధతి మార్చుకోవాలని, మరోసారి తనతో పాటు అందరూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని జగన్ ఉద్బోధించడం. మరోవైపు సర్వే రిపోర్టులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలకు సంకేతాలు వెళ్లాయి. అసలే జగన్ ఎవరి మాట వినరు.
ఒక్కసారి ఇవ్వకూడదని అనుకుంటే ఎవరి సిఫార్సులను ఆయన పరిగణలోకి తీసుకోరు. అందుకే కొందరు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు నిరాశనిస్పృహతో కూడిన కామెంట్స్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి 14 మంది ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలి అధ్వానంగా ఉందనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వారిలో ఎవరెవరు ఉన్నారో తెలిసిన వాళ్లే నెమ్మదిగా ప్రభుత్వ వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ మాట్లాడకుండా, తాను చేయాలనుకున్నది చేస్తూ పోవడం ఖాయం.