ఊసరవెళ్లి...రంగులు మారుస్తూ చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంటుంది. ఎందుకంటే చూస్తుండగానే తన రంగులను మారుస్తూ కనువిందు చేయడాన్ని కథలుకథలుగా చెప్పుకుంటాం. రాజకీయాల్లో నిలకడ లేకుండా రోజుకో అభిప్రాయాన్ని, పార్టీలను, పొత్తులను మార్చుకునే నాయకులను ఊసరవెళ్లితో పోలుస్తుంటారు.
రంగుల పేరు వినగానే ఊసరవెళ్లి...దాని పేరు వింటే తెలుగు రాజకీయాల్లో సహజంగా గుర్తుకొచ్చే పేరేంటో చెబుతారా? అవును మీరనుకుంటున్నది, మీరన్నది నిజమే...ఆ ఘనత వహించిన 40 ఏళ్ల అనుభవశాలి చంద్రబాబే గుర్తుకొస్తారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణమని ఆరా తీస్తే...వెన్నుపోటు అన్నా ఆయనే గుర్తుకొస్తారు. ఊసరవెళ్లి అన్నా ఆయనే గుర్తుకొస్తారు.
గోబెల్స్ అన్నా ఆయనే గుర్తుకొస్తారు. వంచనకు మారుపేరు బాబునే. మాట తప్పడం, మడమ తిప్పడంలోనూ బాబుదే అగ్రస్థానం. ఇలా ఏది తీసుకున్నా బాబునే చాంపియన్. రంగులు మార్చడంలో ఊసరవెళ్లి పెద్దన్నగా చంద్రబాబు ఖ్యాతినార్జించారు. అందులో ఆయన గోల్డ్మెడల్ సాధించారు. అలాంటి పెద్ద మనిషి వైసీపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై స్పందించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.
‘రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రంగులు వేసి మళ్ళీ వాటిని చెరపడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుంచే వసూలు చేయాలి. వృథా చేసిన ప్రజా ధనాన్ని వైసీపీ నుంచి, అలాగే వాళ్ళ తప్పులకు తందాన అన్న అధికారుల నుంచీ రాబట్టాలి. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువు.అన్ని వర్గాల ప్రజలు వచ్చే ప్రభుత్వ కార్యాలయాలను తటస్థ వేదికలుగా ఉంచాల్సిందిపోయి ఒక పార్టీ రంగు వేయడం అనైతికమన్న ఇంగిత జ్ఞానం కూడా లోపించింది’ అని మాజీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రకటనలో నీతిసూత్రాలు పలికారు.
40 ఏళ్ల రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, జనసేన...ఇలా అన్ని పార్టీలతో ఏదో ఒక సందర్భంలో పొత్తు కుదుర్చుకుని ఎప్పటికప్పుడు రంగులు మార్చిన ఘనత చంద్రబాబుది కాదా? రంగుల గురించి ఇప్పుడు ఈయన నీతులు చెబుతుంటే...వినాల్సిన దుస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా? వైసీపీ రంగులు సంగతి పక్కన పెట్టి...ఇప్పుడు తమరు ఏ రంగులో ఉన్నారో, మున్ముందు ముఖానికి ఏయే రంగులు వేసుకునేందుకు ఆలోచిస్తున్నారో కాస్తా చెప్పయ్యా ఊసరవెళ్లి పెద్దన్నా...
-సొదుం