తెలంగాణ తీర్పు.. తెరాస మెజారిటీ దిశగా..!

ఇప్పటి వరకూ కొన్ని నియోజకవర్గాల్లో ఒకటీ రెండు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తి అయ్యింది. కొన్ని చోట్ల పది పన్నెండు రౌండ్లు మొదలుకుని.. నలభై రౌండ్ల కౌంటింగ్ ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకువెళ్తుండటం మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది.

డెబ్బైకి పైగా స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు తొలి రౌండ్లలో ఆధిక్యతను సంపాదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య అరవై ఒకటి. కూటమి అభ్యర్థులు డెబ్బైకి పైగా, ఎనభైకి దగ్గరగా సీట్లలో ముందంజలో కనిపిస్తున్నారు.

కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు  కేవలం ఇరవై చిల్లర సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నారు. ఇక సంచలనాలు ఏమీ లేకుండా ఎంఐఎం తన సీట్లలో, బీజేపీ మూడు సీట్లలో ముందంజలో కనిపిస్తూ ఉంది. తొలి రౌండ్లలో ఉన్న ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారీ మెజారిటీని సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఆఖరి రౌండ్లలో ఫలితాలు తారుమారు  కావని చెప్పడానికి లేదు. కర్ణాటకలో ఇలాగే జరిగింది. తొలి రౌండ్ల ఫలితాలతో బీజేపీ సంబరాలు చేసుకోగా.. ఆఖర్లో మెజారిటీకి దగ్గరదగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే అక్కడ త్రిముఖ పోరు. తొలి రౌండ్లలో తెరాస అభ్యర్థులకు దక్కుతున్న మెజారిటీలను బట్టి చూస్తే.. విజయం వీరిని వరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show comments