జ‌గ‌న్‌కు చెర‌పు తెస్తున్న నేత‌ల మాట‌లు

నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుందంటారు. మాట‌కున్న ప‌వ‌ర్ అలాంటిది. ఒక మాట మాట్లాడ‌టానికి ముందు చాలా సేపు ఆలోచించాల‌ని పెద్ద‌లు చెబుతారు. అయితే నోటి నుంచి మాట డెల‌వ‌రీ అయిన త‌ర్వాత, దాని మీద నిల‌బ‌డేందుకు మాత్ర‌మే ఆలోచించాలంటారు. అందుకే మాటే మంత్ర‌మంటారు. టెక్నిక‌ల్‌గా మ‌నిషి కాళ్ల‌పై నిల‌బ‌డ‌తార‌నే మాటేగానీ, నిజంగా మ‌నిషిని క‌ల‌కాలం నిలిపేది ఆ వ్య‌క్తి మాట‌పై నిల‌బ‌డే నిబ‌ద్ధ‌త‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

రాజ‌కీయాల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చింది...కేవ‌లం మాటే. మాట త‌ప్ప‌డు...మ‌డ‌మ తిప్ప‌డు అనే న‌మ్మ‌కం, భ‌రోసా ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేయ‌గ‌లిగిన నేత కావ‌డం వ‌ల్లే వైఎస్ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచాడు.

వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌న్ కూడా "మాట త‌ప్ప‌ను...మ‌డ‌మ తిప్ప‌ను" అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌గ‌లిగాడు. రాజ‌న్న కొడుకు జ‌గ‌న్‌...నాన్న‌లాగే చెప్పింది చేస్తాడు, చేయ‌గ‌లిగిందే చెబుతాడు అనే విశ్వాసాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డం వ‌ల్లే ఉద్ధండుల‌ను మ‌ట్టి క‌రిపించి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోగ‌లిగాడు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రు నేత‌ల మాట దురుసుతో అన‌వ‌ర‌సరమైన స‌మ‌స్య‌లొస్తున్నాయి.

తాజాగా రాజ‌ధాని త‌ర‌లింపుపై కొంత మంది నేత‌లు నోటికి ప‌ని చెప్ప‌డం వ‌ల్ల‌...అంతిమంగా జ‌గ‌న్ స‌ర్కార్ న్యాయ‌స్థానానికి స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌చ్చింది.  రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని...ఒక‌రిద్ద‌రు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసంద‌ర్భ మాట‌లు కొత్త స‌మ‌స్య తీసుకొస్తున్నాయి. స‌ద‌రు మాట‌ల‌ను ఆస‌రాగా చేసుకుని రాజ‌ధాని త‌ర‌లిస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతి రావు హైకోర్టులో పిటిషన్ వేశాడు.

ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ‌లో భాగంగా రాజ‌ధాని త‌ర‌లిస్తున్నారా అని హైకోర్టు ప్ర‌శ్నించింది. అయితే  రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్ కాకుండా.. రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.  అంతేకాదు, అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఏదైనా చేయాల‌నుకుంటే చేత‌ల్లో చూపితే...ఇలాంటివి చోటు చేసుకోవు. అలా కాకుండా కేవ‌లం మాట‌ల‌కు ప‌ని చెప్ప‌డం వ‌ల్ల‌...అంతిమంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు, ఆయ‌న ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌స్తుంద‌నే మౌళిక అంశాన్ని కొంద‌రు నేత‌లు విస్మ‌రిస్తున్నారు. ఇప్ప‌టికైనా మాట‌ల‌ను క‌ట్ట‌బెట్టి, చేత‌ల్లో చూపితే మంచిది. తాజా అనుభ‌వాల‌తో గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

-సొదుం

ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు

Show comments