సైరాపై రంగస్థలం ఎఫెక్ట్

లెక్కప్రకారం ఈ దసరా నుంచి సైరా నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ఈ సినిమా ఆ టైమ్ కు పట్టాలపైకి రాదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి 151వ సినిమాను వచ్చే నెల చివరి వారం నుంచి సెట్స్ పైకి తీసుకొస్తారట. ఈ సినిమాను వాయిదా వేయడానికి ముఖ్యంగా 3 కారణాలు చెబుతున్నారు.

రీజన్ 1: రంగస్థలం
ఓవైపు రంగస్థలం సినిమాలో నటిస్తూనే మరోవైపు సైరా నిర్మాణ బాధ్యతల్ని చూసుకోవడం కష్టంగా మారింది రామ్ చరణ్ కి. అందుకే సుకుమార్ తో చేస్తున్న సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాతే సైరా నిర్మాణ బాధ్యతల్ని చూసుకోవాలని చెర్రీ భావిస్తున్నాడట. అందుకే సైరా రెగ్యులర్ షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. 

రీజన్ 2: సెట్స్
సైరా నరసింహారెడ్డి కోసం భారీ సెట్స్ అవసరం. ఇటు హైదరాబాద్ తో పాటు అటు జైపూర్ లో కూడా సైరా కోసం భారీ సెట్స్ నిర్మాణం కొనసాగుతోంది. ఇవింకా నిర్మాణ దశలోనే ఉన్నాయట. షూటింగ్ కు అందుబాటులోకి రాలేదట. అందుకే అక్టోబర్ ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పెట్టుకున్నట్టు సమాచారం.

రీజన్ 3: కాల్షీట్ల సమస్య
సైరా సినిమాకు కాల్షీట్ల సమస్య కూడా ఉంది. ఇందులో హీరోయిన్ గా ఎంపికైన నయనతారతో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి నటులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. బల్క్ లో వీళ్ల కాల్షీట్లు సంపాదించడం కూడా సమస్యే.

సైరా సినిమాకు సంబంధించి యూనిట్ హడావుడి పడడం లేదు. ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోలేదు. అవసరమైతే ఏడాది గ్యాప్ తీసుకుందామని కూడా ఫిక్స్ అయ్యారు. 200కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను చిరు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిపేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు.

Show comments