విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెబుతూ, వాళ్లకు అండగా ఎలా నిలవాలో మంత్రి పేర్ని నానిని చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూసి నేర్చుకోవాలి. రాజకీయ నాయకుడంటే, ప్రజా ప్రతినిధి అంటే ఎలా ఉండాలో పేర్ని నాని చేతల్లో చూపుతున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో, రెడ్జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో ఆశా వర్కర్లతో కలిసి మంత్రి పర్యటించాడు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నాడు. ఎవరూ భయపడవద్దని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ధైర్యం చెప్పాడు.
మంత్రి పేర్నినే నేరుగా ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తుండటం, వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటుండంతో ప్రజలు కాస్తా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఎందుకంటే ఓట్ల సమయంలో మినహా మిగిలిన సమయాల్లో రాజకీయ నేతలు తమ గడప తొక్కరనే అభిప్రాయంలో జనం ఉన్నారు. ఇది నిజం కూడా.
దీనికి విరుద్ధంగా కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ రాష్ట్ర మంత్రే నేరుగా గడపగడపా తొక్కుతూ వెళ్లడంతో ప్రజలు అభినందిస్తున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి...వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రే రంగంలోకి దిగడంతో....ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలనే టాక్ వినిపిస్తోంది.