ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా విభేదించే కొన్ని వర్గాల వారు, మేనిఫెస్టో విషయంలో ఆయన బాధ్యతయుతంగా వ్యవహరించారని ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు, తటస్థులు వైసీపీ మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ పోస్టు ఏంటంటే...
"నాకైతే జగన్ నిజాయతీ బాగా నచ్చింది.. రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం ఎంత?, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు ఎంత?, సంక్షేమ బడ్జెట్ కు అయ్యే ఖర్చు ఎంత?, వీటిని దృష్టిలో పెట్టుకొని చేయగలిగింది చెప్పాడు! అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని భావించలేదని అనిపించింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు కూటమి మేనిఫెస్టోను మరియు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పక్కపక్కన పెట్టుకుని బాగా చదువుకోవాలి. ఏ మేనిఫెస్టో ఆర్థిక క్రమశిక్షణను పాటించింది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఉద్యోగుల జేబులకు చిల్లు పడకుండా పాలించగలుగుతుంది అనే విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబద్దం తియ్యగా ఉంటుంది బాబు గారి హామీలాగా! నిజం నికార్సుగా, చేదుగా ఉంటుంది జగన్ ఇచ్చిన మాట లాగా! అందుకే నాకైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించిన జగన్ నిజాయతీ నచ్చింది"
ఈ విధంగా వైసీపీ మేనిఫెస్టోపై రెండో కోణాన్ని చూడొచ్చు. రాష్ట్ర బడ్జెట్, అందులో సంక్షేమం, ఇతరత్రా అభివృద్ధి పనులకు ఎంతెంత కేటాయించ వచ్చో పాలకుడిగా జగన్కు అనుభవం రావడం వల్లే అలివికాని హామీలు ఇవ్వలేదని వైసీపీ చెబుతోంది. ఇందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి సానుకూలత స్పందన కనిపించడం గమనార్హం. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుకే బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇంకా ఆకర్షణీయమైన పథకాలను కూటమి తీసుకొస్తుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు జీతాలు మరిచిపోవాల్సిందే. ఈ వాస్తవం బాగా తెలియడం వల్లే వారంతా జగన్ మేనిఫెస్టోపై సానుకూలంగా ఉన్నారని సమాచారం.