ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 107 మంది మృత్యువాత చెందగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో భోలే బాబా సత్సంగం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
ఈ దుర్ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్రాస్ జిల్లాలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ.. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. అలాగే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.